బాబు అలా చేస్తే....వీరు ఇలా చేస్తారు...!

Update: 2018-04-19 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు దీక్షకు దిగనున్నారు. తాను దీక్షకు దిగేరోజు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక వాతావరణం ఉండేలా టీడీపీ చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు దీక్ష కోసం మంత్రుల కమిటీని నియమించారు. కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబులు దీక్ష కు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్షకు రేపు దిగనున్నారు. దీనికి ధర్మ పోరాటం అని పేరుకూడా పెట్టారు.

రేపు ఉదయం 7గంటల నుంచి.....

రేపు ఉదయం 7గంటల నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షను చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాత్రి ఏడు గంటల వరకూ దీక్ష కొనసాగుతుంది. చంద్రబాబు దీక్షను ప్రారంభించే సమయంలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు కూడా దీక్షను చేపడతారు. మంత్రులు కూడా 13 జిల్లాల్లో దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రతి మండల కేంద్రంలోనూ టీడీపీ కార్యకర్తలు దీక్షకు దిగాలని సూచించారు.

నేతలకు దిశానిర్దేశం.....

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని, పోరాటాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే రేపటి లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం చేసిన మోసాన్ని గురించి ఎక్కడకక్కడ ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అలాగే ప్రతిపక్ష వైసీపీ కూడా బీజేపీతో చేస్తున్న లాలూచీ రాజకీయాన్ని కూడా ప్రజలకు వివరించాలని కోరారు. వైసీపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందన్న విషయం ప్రజలు గ్రహించేలా టీడీపీ నేతలు తమ ప్రసంగాలు ఉండాలని ఆయన ఉద్భోదించారు. చంద్రబాబు తన పుట్టిన రోజు నాడే దీక్షకు దిగుతుండటం, కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేయడం తమకు కలిసి వచ్చే అంశంగా టీడీపీ భావిస్తోంది.

Similar News