సంచలనం రేపుతున్న బుల్లి బాయ్ యాప్
భారతదేశంలో బుల్లి బాయ్ యాప్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలను అమ్మకానికి పెట్టిన యాప్ ఇది.
ప్రస్తుతం భారతదేశంలో బుల్లి బాయ్ యాప్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలను అమ్మకానికి పెట్టిన యాప్ ఇది. అందుకే ప్రతి పక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 'గిట్ హబ్' వేదికగా కార్యకలాపాలు నిర్వహించే 'బుల్లి బాయి' అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రకటిస్తూ వచ్చారు. మహిళల ఫొటోలు అప్లోడ్ చేసి.. అమ్మకానికి ఉన్నారంటూ ప్రకటనలు ఇస్తున్న 'బుల్లీ బాయ్' అనే యాప్ వ్యవహారం గురించి మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ బుల్లీ బాయ్ యాప్ బాధితుల్లో ముస్లిం మతానికి చెందిన వందలాది మంది మహిళలు, విద్యార్థినులు, ప్రముఖులు, జర్నలిస్టులు ఉన్నారు.
అభ్యంతరకరమైన....
అభ్యంతరకరమైన కంటెంట్ ఫిర్యాదుల నేపథ్యంలో వివాదాస్పద యాప్ బుల్లి బాయిని హోస్టింగ్ ప్లాట్ఫారమ్ గిట్ హబ్ బ్లాక్ చేసింది. ఈ పోర్టల్ జనవరి 1, శనివారం ప్రారంభించబడింది. అనేక ముస్లిం మహిళల చిత్రాలను కలిగి ఉంది, అవమానకరమైన కంటెంట్ కూడా ఉంది. ఈ యాప్ పై చేసిన ఫిర్యాదులలో 'బుల్లి బాయి' అనే పదం అగౌరవంగా ఉంది. ఈ వెబ్సైట్/పోర్టల్ (bullibai.github.io) యొక్క కంటెంట్ స్పష్టంగా ముస్లిం మహిళలను అవమానించే లక్ష్యంతో ఉంది. 'బుల్లి' అనే అవమానకరమైన పదం ముస్లిం మహిళల కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడింది. మొత్తం వెబ్సైట్ ముస్లిం మహిళలను అవమానపరిచే ఉద్దేశ్యంతో రూపొందించబడినట్లు కనిపిస్తోంది.
కంటెంట్ పై...
పోర్టల్ లో అనుచితమైన, ఆమోదయోగ్యం కాని కంటెంట్ ఉందని పలువురు ఆరోపించారు. 'బుల్లి బాయి' యాప్లో చిత్రాలను అప్లోడ్ చేయడం గతేడాది జూలైలో వివాదానికి కారణమైన 'సుల్లి డీల్స్' అప్లోడ్ మాదిరిగానే ఉంది. 'బుల్లి బాయి' యాప్ సుల్లి డీల్స్ చేసిన విధంగానే పని చేసింది. యాప్ తెరిచిన తర్వాత, ఒక ముస్లిం మహిళ ముఖం యాదృచ్ఛికంగా బుల్లి బాయ్ గా ప్రదర్శించబడింది. జర్నలిస్టులతో సహా ట్విట్టర్లో బలమైన ఉనికిని కలిగి ఉన్న ముస్లిం మహిళలను ప్రత్యేకించి వారి ఫోటోలు అప్లోడ్ చేయబడ్డాయి. 'బుల్లి బాయ్' లాగా, 'సుల్లి డీల్స్' కూడా GitHubలో హోస్ట్ చేయబడింది. గత ఏడాది సుల్లి డీల్స్ ఘటనలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు నేరస్థులపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు.
దోషుల అరెస్ట్ కు....
'బుల్లీ బాయి' యాప్ కు సంబంధించి దోషులను అరెస్టు చేయడంతో సహా చర్యల కోసం ముంబై పోలీసులతో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ "ఈ ఉదయం బుల్లీ బాయ్ బ్లాక్ చేసినట్లు GitHub ధృవీకరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT), పోలీసు అధికారులు తదుపరి చర్యలను తీసుకుంటూ ఉన్నారు" అని తెలిపారు "ఈ విషయంపై భారత ప్రభుత్వం ఢిల్లీ, ముంబైలోని పోలీసు సంస్థలతో కలిసి పనిచేస్తోంది" అని ఆదివారం చెప్పుకొచ్చారు. ఈ యాప్ను ట్విట్టర్ హ్యాండిల్ @bullibai ప్రచారం చేస్తోంది, ఇది "ఖల్సా సిక్కు ఫోర్స్" ద్వారా నిర్వహించబడుతుందని తెలుస్తోంది. ట్విట్టర్ పేజీలో ఖలిస్తాన్ అనుకూల అంశాలు ఉండడం స్పష్టంగా ఉన్నాయి. #FREEJAGGINOW అనే బ్యానర్ను కూడా కలిగి ఉంది.
వేలం వేస్తూ....
'బుల్లి బాయి' యాప్ లో వేలం వేస్తున్న మహిళల ఫొటోల్లో తనది కూడా అప్ లోడ్ చేశారంటూ ఆయేషా మినాజ్ అనే మహిళా పాత్రికేయురాలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఈ యాప్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదని.. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను ట్యాగ్ చేశారు. నామమాత్రపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, నిందితులను చట్టం ముందుకు తీసుకురావాల్సిందేనని అన్నారు. ఈ ఘటనలో తెలంగాణ పోలీసు విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్, యాంటీ రాడికలైజేషన్ దళాల సేవలను వినియోగించుకోవాలని ఒవైసీ సూచించారు.
విచారణ ప్రారంభం....
బుల్లి బాయ్ అనే యాప్లో వేలానికి అప్లోడ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ముంబై సైబర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోటో అప్లోడ్ చేయబడిన ఓ జర్నలిస్టు ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొన్ని గంటల్లోనే ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు. పశ్చిమ ప్రాంత సైబర్ పోలీస్ స్టేషన్ లో శనివారం నాడు పలు IPC సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. Twitter హ్యాండిల్ పైనా, 'బుల్లీ బాయి' యాప్ డెవలపర్పైనా కూడా విచారణ మొదలుపెట్టారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ "ముంబై సైబర్ సెల్ దర్యాప్తును ప్రారంభించింది, సైట్ లింక్ బ్లాక్ చేయడంతో ముంబై, మహారాష్ట్ర లలో ఎంత మంది బాధితులు ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు. ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు స్త్రీలపై ద్వేషం పెంపొందిస్తూ, స్త్రీలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఒక వర్గంపై ఇలాంటివి చేయడం అవమానకరమైనదని, మహారాష్ట్ర ప్రభుత్వం అలాంటి వేదికలపై కఠిన చర్యలు తీసుకుంటోందని ముంబై పోలీసులు తెలిపారు.