TDP : బాబు మాటలు అంతే... నేతల తీరు మారదంతే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినసొంపుగా ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినసొంపుగా ఉంటాయి. పార్టీ కార్యకర్తలను దరి చేర్చుకోవాలని ఆయన పదే పదే చెబుతారు. ఆయన కూడా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా కార్యకర్తలతో సమావేశమవుతారు. కానీ నియోజకవర్గాల్లో మాత్రం నేతలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు పదే పదే ఈ మాటలు చెబుతున్నా నేతలు మాత్రం తమ చెవికి ఎక్కించుకోవడం లేదు. కార్యకర్తలను పట్టించుకోని, ఇబ్బందులు పెట్టే నేతలు అవసరం లేదని చంద్రబాబు చెబుతుంటారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
కానీ ఎన్నికల సమయానికి వచ్చే సరికి ఆయన ప్రయారిటీలు మారతాయని కార్యకర్తలే అంటున్నారు. అప్పుడు నేతల ఆర్థిక పరిస్థితిని ప్రధానంగా చూస్తారు. సామాజికవర్గం చూస్తే పరవాలేదు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువగా టిక్కెట్లు ఇస్తారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వడం అన్నది రాజకీయాల్లో ప్రధానం. దానిని ఏ పొలిటికల్ లీడర్ కాదనరు. ఎందుకంటే గెలుపు ప్రధానం. అధికారం కూడా అవసరం. అందుకే అప్పుడు తీసుకునే నిర్ణయాలు పార్టీ క్యాడర్ ను దృష్టిలో ఉంచుకుని చేసేవి కావన్నది అందరికీ తెలుసు.
ఎన్నికలు పూర్తయిన తర్వాత...
కానీ ఎన్నికల పూర్తయి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబుకు కార్యకర్తలు గుర్తుకు వస్తుంటారు. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టి గెలుచుకున్న ఎమ్మెల్యేల ప్రయారిటీ వేరుగా ఉంటుంది. వారు తమకు ఎన్నికల్లో సహకరించిన ముఖ్య కార్యకర్తలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. అంతే తప్ప దశాబ్దకాలం నాటి నుంచి పసుపు జెండాను పట్టుకున్న వారిని మాత్రం పట్టించుకోరు. చంద్రబాబు కూడా ఆ ఊసు ఎత్తరు. చంద్రబాబు అలా మాట్లాడటం మామూలే. తర్వాత కార్యకర్తలకు అన్యాయం జరగడం షరా మామూలే..నంటూ సోషల్ మీడియాలో క్యాడర్ పోస్టులు పెడుతుండటం విశేషం.