Nagababu : జనసేనకు నాగబాబు గుదిబండగా మారారా?
జనసేనకు ఎమ్మెల్సీ నాగబాబు గుదిబండగా మారినట్లు కనపడుతుంది.
జనసేనకు ఎమ్మెల్సీ నాగబాబు గుదిబండగా మారినట్లు కనపడుతుంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు సొంత పార్టీ నేతలే. పవన్ కల్యాణ్ ను సరైన సలహాలు ఇవ్వాల్సిన సోదరుడు నాగబాబు ఆయనను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాగబాబు ప్రయారిటీ వేరే విధంగా ఉంటుందని చెబుతున్నారు. అసలు సిసలైన కార్యకర్తలకు న్యాయం చేయకుండా చిరంజీవి అభిమానులకే పెద్ద పీట వేస్తున్నారంటూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.
పార్టీ పెట్టిన వెంటనే...
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన వెంటనే నాగబాబు ఎందుకు జనసేనలో చేరలేదని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు మాత్రమే ఎందుకు జనసేనలో యాక్టివ్ అయ్యారని నిలదీస్తున్నారు. ఆయన పార్టీలో చేరిన తర్వాత తొలి నుంచి జనసేన జెండా పట్టుకున్న నేతలను పక్కన పెట్టడంతో పాటు మెగా అభిమానులను ముందర పెట్టేందుకు తంటాలు పడుతున్నారని, దీనివల్ల ఒరిజినల్ జనసేన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. అనేక జిల్లాల్లో ఇదేరకమైన పరిస్థితి ఉందని, కానీ పవన్ కల్యాణ్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా వాటినే నమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.
చెడు ఉద్దేశ్యం లేకపోయినా...
నాగబాబుకు జనసేనకు చెడు చేయాలని ఉద్దేశ్యం లేకపోవచ్చు. మెగా అభిమానులయితే పార్టీకి కమిట్ మెంట్ తో పని చేస్తారని భావించి ఉండవచ్చు. కానీ పవన్ కల్యాణ్ ను నమ్మి జెండాను ముందు పట్టుకుని వచ్చిన వారు మాత్రం అన్యాయానికి గురవుతున్నారంటున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ మెగా అభిమానులకే పెద్దపీట వేస్తున్నారని, ఒరిజినల్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. మొత్తం మీద నాగబాబు తన సోదరుడు పార్టీని ఫుల్లు కంట్రోల్ లో పెట్టాలని ప్రయత్నం చేసే చర్యల్లో భాగంగా మెగా ఫ్యాన్స్ కు న్యాయం చేయడం తప్పు కాదు. అలాగని ఒరిజినల్ నేతలను విస్మరించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.