కేసీఆర్‌కు బీఆర్ఎస్ కలసిరాలేదా?

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని వివాదాలు చుట్టుముడుతున్నాయి

Update: 2023-03-17 05:29 GMT

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే ఉంది. అయితే జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చికాకును కలిగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఒకవైపు సర్వేలు చేయిస్తూ, సిట్టింగ్ లలో ఎవరెవరికి తిరిగి సీట్లు ఇవ్వాలన్న దానిపై ఆయన కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అవినీతి, అసమర్థత రెండు పార్టీని కమ్మేశాయి.


ఈ రెండు అంశాలు...

కానీ ఆయనకు రెండు అంశాలు చేతులు కట్టేపడేసే విధంగా ముందున్నాయి. 1. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ను ఈడీ విచారించడానికి సిద్ధపడటం. 2. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజీ. రెండు అంశాలు ఎన్నికలతో ముడిపడి ఉన్నవే. దీన్నుంచి బయటపడితేనే తప్ప ఆయన ప్రశాంతంగా ప్రచారాన్ని నిర్వహింలేరు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు ఆమె ఆ స్కామ్ లో ఉన్నారా? లేదా? అన్నది న్యాయస్థానాల్లో నిర్ధారణ కావాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకూ చికాకు తప్పదు. ఒకవేళ అరెస్టయి జైలుకు వెళ్లినా ఆశించినంత సానుభూతి వస్తుందా? అన్న సంశయం కూడా గులాబాబీస్ ను వదిలపెట్టడం లేదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.
జనాలు ఏమనుకుంటున్నారు?
అందుకే తొలుత విచారణకు భయపడేది లేదని, తెలంగాణ తలవంచదని చెప్పిన కవిత చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వంటివి ప్రజల్లో నెగిటివ్‌గా మారే అవకాశాలు లేకపోలేదన్నది బీఆర్ఎస్ నేతల అనుమానం. ఎందుకంటే ఏ అవినీతి చేయకపోతే విచారణకు ఎందుకు జడుస్తున్నారు? కవితను మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడిని కూడా విచారణకు పిలుస్తున్నారు కదా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తకమానదు. ముఖ్యంగా మహిళల ఓట్లు కవిత కారణంగా కొంత జారి పోయే అవకాశముందన్న అంచనాలో కూడా గులాబీనేత ఉన్నారని సమాచారం. అయితే పూర్తి స్థాయి సర్వేలు మరొకసారి చేయిస్తే కాని అసలు విషయం తేలదు. ఇందుకు సమయం పడుతుంది.

నిరుద్యోగ యువత కూడా...
ఇక యువత కూడా టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా గులాబీ పార్టీకి దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందులో అధికార పార్టీ తప్పులేక పోవచ్చు. ప్రమేయం ఉండి ఉండకపోవచ్చు. కానీ ప్రశ్నాపత్రాల లీకేజీ మాత్రం ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశాలు మాత్రం లేకపోలేదు. అధికారుల వైఫ్యలమే అయినా ప్రభుత్వంపై ఆ ప్రభావం నిరుద్యోగ యువతలో స్పష్టంగా కనిపిస్తుంది. విపక్షాలు పెద్దగా బలంగా లేకపోవడం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయినప్పటికీ గతంలో మాదిరి ఎన్నికలను ఆషామాషీగా తీసుకునే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల అంచనా. ఈ రెండు అంశాల నుంచి త్వరగా బయటపడాలన్నది ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News