సుజనా కష్టానికి ఫలితం కనపడుతోందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక రూట్ మ్యాప్ అయితే దొరికినట్లే కన్పిస్తుంది. వైసీపీని టార్గెట్ చేయనుంది

Update: 2021-12-23 08:20 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక రూట్ మ్యాప్ అయితే దొరికినట్లే కన్పిస్తుంది. నిన్న మొన్నటి వరకూ ఎటువెళ్లాలో తెలియక క్రాస్ రోడ్స్ లో ఉన్న నేతలకు అమిత్ షా ఒక రూట్ మ్యాప్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. వైసీపీని టార్గెట్ చేయడమే ఈ మ్యాప్ లక్ష్యంగా కన్పిస్తుంది. బలహీనమైన టీడీపీని పట్టుకుని వేలాడే కంటే వైసీపీని టార్గెట్ చేస్తేనే మంచిదన్న ధోరణిలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లు కనపడుతుంది.

ఈ నెల 28న
ఈ నెల 28 వ తేదీన విజయవాడలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కేవలం వైసీపీని లక్ష్యంగా చేసుకునే నిర్వహిస్తారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీకి సానుకూలంగా ఉన్న నేతలందరూ ఇప్పుడు టోన్ మార్చారు. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజులు వైసీపీపై ఒంటికాలిమీద లేవడం కేవలం అమిత్ షా క్లాస్ పీకిన తర్వాతే. ఇప్పుడు బీజేపీ నేతలందరూ వైసీపీని టార్గెట్ చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
వైసీపీని టార్గెట్ గానే...
మరోవైపు సమయం కోసం కాచుక్కూర్చున్న సుజనా చౌదరి బ్యాచ్ కూడా ఇటీవల యాక్టివ్ అయింది. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్ వంటి నేతలు ఇటీవల ఒంగోలులో వైశ్య సామాజికవర్గానికి చెందిన సుబ్బారావుపై దాడిని ఖండించారు. దీనిపై తనకు పూర్తి వివరాలను పంపితే తాను కేంద్రహోంశాఖకు పంపి నిందితులకు శిక్షపడేలా చూస్తానని చెప్పడం విశేషం. పవన్ కల్యాణ్ ను సంతృప్తి పర్చడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ దూరమవుతాడని కావచ్చు....
వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే పవన్ కల్యాణ్ పార్టీకి దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే వైసీపీని టార్గెట్ చేసి పవన్ ను తమ వెంటే ఉంచుకోవాలన్న ప్లాన్ లో ఉన్నారు. అందుకే ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభలో ఏపీ ఆర్థిక పరిస్థిితి, కేంద్రం నుంచి అందుతున్న సాయం, వివిథ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోలేకపోతుందన్నది వివరిస్తారట. అంటే ప్రభుత్వం తాము ఢిల్లీ నుంచి అందిస్తున్న సాయాన్ని కూడా వినియోగించుకోలేకపోతుందని ప్రజలకు వివరించనున్నారు. సుజనా చౌదరి ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లే కనపడుతున్నాయి.


Tags:    

Similar News