కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించిందే నేను: తుమ్మల

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు

Update: 2023-10-28 03:21 GMT

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పూటకో పార్టీ మారే వారిని నమ్మొద్దన్నారు. తుమ్మ‌ల ఓడిపోయి మూల‌కు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశానని సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే చేసి ఐదేళ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే.. ఒక్క సీటు రాకుండా చేశార‌ని తుమ్మ‌ల‌పై కేసీఆర్ ఆరోపణలు గుప్పించారు. అయితే నేను తుమ్మ‌ల‌ నాగేశ్వ‌ర్ రావుకు అన్యాయం చేశాన‌ని ప్ర‌చారం చేస్తున్నాడని కేసీఆర్ ఆరోపించారు.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. 1995లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించానన్నారు తుమ్మల. గోదావరి జలాలను మున్నేరు ద్వారా పాలేరుకు లిఫ్ట్‌ చేసి జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా కోరిక అని.. అందుకే కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు తుమ్మల. 2018 ఎన్నికల్లో పాలేరులో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసన్నారు. పువ్వాడ అజయ్‌ని మంత్రిని చేయడం కోసం మీ కుమారుడు.. నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడించారని తుమ్మల ఆరోపించారు. నాడు పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయాడానికి ఎవరూ ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను అంగీకరించాననే సంగతి మర్చిపోయారని తుమ్మల చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News