Telangana: ప్రచారాల జోరు.. నేతల మధ్య మాటల యుద్దాలు

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం తారా స్థాయికి చేరుకుంటుంది. అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి..

Update: 2023-11-04 14:45 GMT

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం తారా స్థాయికి చేరుకుంటుంది. అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలు కాగానే రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నువ్వా.. నేనా.. అన్నట్లు ప్రచారంలో మునిగిపోతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలతో రాజకీయాల్లో రచ్చ రేపుతున్నారు. ఎవరికి వారు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు సీఎం కేసీఆర్‌ ప్రచారాలతో హోరెత్తిస్తుంటే ఇటు ప్రతిపక్షాలు మరో వైపు హోరెత్తిస్తున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సెంటిమెంట్‌ను అనుసరించి.. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని కేసీఆర్‌ దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేసే ప్రతిసారి కేసీఆర్‌ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. నవంబర్ 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు కేసీఆర్‌. అదే రోజు బీఆర్‌ఎస్‌ ఆశీర్వాదసభల్లో కూడా పాల్గొంటారు.

కేసీఆర్‌ 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఈ ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్‌ వేస్తున్నారు. అదే సెంటిమెంట్‌ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించారు బీఆర్‌ఎస్ అధినేత. ఇక మరోవైపు మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే.. వివిధ వర్గాలు, పార్టీ నేతలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. హైద‌రాబాద్ జ‌ల‌విహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల స‌మ్మేళ‌నంలో పాల్గొన్న కేటీఆర్‌..గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. తమకు ప్రజలతో తప్ప ఎవరితోనూ పొత్తు లేదన్న కేటీఆర్‌.. మన రాష్ట్రంపై పక్క రాష్ట్రాల నేతల దాడి ఎందుకు అని ప్రశ్నించారు.

ఇక కరెంట్‌ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా..డీకే శివకుమార్‌ పేరుతో వైరల్ అయిన లేఖ మరో రచ్చ రేపుతోంది. దీంతో కర్నాటక ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు మంత్రి కేటీఆర్. అయితే అసలు ఆ లేఖ తాను రాయలేదంటూ డీకే శివకుమార్ ట్వీట్‌ చేయడం మరో కొసమెరుపు.

పొత్తు ఖరారైనట్లేనా..?

మరోవైపు తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు దాదాపు ఖరారు అయినట్లు కనిపిస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 లేదా 9 సీట్లు ఇచ్చే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు స్థానాలు, ఖమ్మంలో నాలుగు సీట్లు జనసేనకు ఇవ్వడానికి బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్న సీట్లలో కూకట్‌పల్లి, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌కర్నూల్, తాండూరు ఉన్నాయి. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్‌లో మరో సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News