Kalvakuntla Kavitha: కవిత కేసు విచారణ మళ్ళీ వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను మార్చి 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది

Update: 2024-02-28 11:27 GMT

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను మార్చి 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. లిక్కర్‌ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంలో పిటిషన్‌ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరింది. సీఆర్పీసీ ప్రకారం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. బుధవారం పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా, తగినంత సమయం లేకపోవడంతో కోర్టు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనగా కవిత రానని చెప్పేశారు. తాను విచారణకు హాజరుకాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని అన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కవిత కోరారు.


Tags:    

Similar News