Revanth Reddy : నేడు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దావోస్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దావోస్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు –2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది.
పారిశ్రామికవేత్తలతో...
మొదటి రోజున వివిధ రంగాల కు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్బంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్ మ్యాప్ను పరిచయం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను ప్రస్తావించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డిసెంబర్ లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన అభివృద్ధి నమూనా కు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యం ఎంచుకున్నారు.