తెలంగాణలో నీలిరంగు పుట్టగొడుగులు.. తింటే?

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో నీలి పుట్టగొడుగులు విస్తృతంగా

Update: 2023-07-26 10:30 GMT

అరుదైన పుట్టగొడుగులు తెలంగాణలో కనిపించాయి. న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులు కాగజ్‌నగర్ డివిజన్‌లోని అడవులలో కనిపించాయి. ఈ నీలిరంగు పుట్టగొడుగులు చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి జాతికి చెందిన ఇవి కనపడడం తెలంగాణలో ఇదే మొదటిసారి. తెలంగాణలో జీవవైవిధ్యాన్ని ప్రతిబింబమని నిపుణులు అంటున్నారు. ఈ డివిజన్‌లో తొలిసారిగా వేంపల్లి అడవుల్లో అరుదైన పుట్టగొడుగులు కనిపించాయని కాగజ్‌నగర్ అటవీ డివిజనల్ అధికారి విజయ్ తెలిపారు. ఇటీవల మొలకెత్తిన పుట్టగొడుగులు వేంపల్లి అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని.. వాటిని అటవీశాఖ సిబ్బంది గుర్తించిందన్నారు. ఈ స్కైబ్లూ మష్రూమ్స్ ఇటీవలే మొలిచినట్లు వేంపల్లి రేంజ్లోని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో నీలి పుట్టగొడుగులు విస్తృతంగా పెరుగుతున్నట్టు గుర్తించామన్నారు.

ఈ పుట్టగొడుగులను సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొదటిసారిగా ఈ నీలిరంగు పుట్టగొడుగులు 1989లో ఒడిశాలో కనిపించాయన్నారు. న్యూజిలాండ్‌లో ఈ ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి జాతికి చెందిన పుట్టగొడుగులు కనిపిస్తాయి. ఎంటోలోమా జాతికి చెందిన చాలా రకాలు విషపూరితమైనవే..! కాబట్టి తెలంగాణలో కనిపించిన ఈ పుట్టగొడుగులను కూడా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీటికి న్యూజిలాండ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ దేశ కరెన్సీ నోట్లపై కూడా ఈ అందమైన పుట్టగొడుగు జాతుల బొమ్మలు ఉంచారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News