కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీని వీడారు. మంచిర్యాల జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్‌గా

Update: 2022-05-19 14:06 GMT

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీని వీడారు. మంచిర్యాల జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న త‌న భార్య భాగ్య‌ల‌క్ష్మితో క‌లిసి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో క‌లిసి ఓదెలు దంప‌తులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ స‌మ‌క్షంలో వారు కాంగ్రెస్‌లో చేరిపోయారు. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ వెన్నంటి సాగిన ఓదెలు 2009లో చెన్నూరు నుంచి టీఆర్ఎస్ త‌ర‌ఫున‌ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి 2010లో మ‌ళ్లీ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవత‌రించాక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న చెన్నూరు నుంచే ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌భుత్వ విప్‌గా ప‌నిచేశారు. 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్ చెన్నూరు టికెట్‌ను పార్టీ యువ‌నేత బాల్క సుమ‌న్‌కు ఇచ్చి ఓదెలును ప‌క్క‌న‌పెట్టారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్న ఆయన తాజగా కాంగ్రెస్ పార్టీ చెంతన చేరారు. భాగ్య‌ల‌క్ష్మి జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ ప‌ద‌వి ఇంకా రెండేళ్ల పాటు ఉంది.

బాల్క సుమన్ వల్లే పార్టీ మారామని న‌ల్లాల ఓదెలు చెప్పుకొచ్చారు. తమను ఎంతో అవమానించారని, మీకు అర్హత లేదని అన్నారని చెప్పుకొచ్చారు. బాల్క సుమన్ తమను తీవ్ర మనస్థాపానికి గురి చేశాడని తెలిపారు ఓదెలు. రేవంత్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళామని అన్నారు. జిల్లా జెడ్పీ కి కూడా రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. నియోజకవర్గంలో బాల్క సుమన్ చర్యలు నచ్చకపోవడంతో నల్లాల ఓదేలు దూరంగా వస్తూ వచ్చారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీ మారాలని ఓదేలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News