అభివృద్ధే అమరులకు అసలైన నివాళి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లాంటి నగరంలో స్కై వే ల నిర్మాణం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. రక్షణ శాఖ మంత్రులు..

Update: 2023-06-23 13:40 GMT

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే.. అమరులకు అసలైన నివాళి అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఐటి, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, తొమ్మిదేళ్లలో కేంద్రం నుంచి నగరానికి వచ్చిన నిధులు శూన్యమన్నారు.

హైదరాబాద్ లాంటి నగరంలో స్కై వే ల నిర్మాణం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా.. హైదరాబాద్ విషయంలో కేంద్రం వైఖరి మారలేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసనా ఎలాంటి ఫలితం లేదన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వరకు ఒక స్కై వే నిర్మాణం, పారడైజ్ చౌరస్తా నుంచి మేడ్చేల్ ఓఆర్ఆర్ వరకి మరో స్కై వే నిర్మాణం… వీటికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని మరోసారి మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.
రక్షణ శాఖ నుంచి రాజీవ్ రహదారి వైపు స్కై వేల నిర్మాణం కోసం 96 ఎకరాల భూమి, మేడ్చల్ వైపు మరో 56 ఎకరాల భూమి ఇస్తే అంతే విలువ కలిగిన భూమిని ఇస్తామని చెప్పినా స్పందన లేదన్నారు. స్కై వేల మాదిరే స్కై వాక్ ల నిర్మాణాన్ని కూడా చేస్తున్నాం. ఉప్పల్ లో చేపట్టింది స్కై వాక్ పూర్తయింది. కానీ రక్షణ శాఖ పరిమితుల వలన మెహదీపట్నంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గోల్కొండ, ఇబ్రహీం భాగ్ లింకు రోడ్ల కోసం అవసరమైన రక్షణ భూమిని కూడా అడిగామన్నారు. కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జిహెచ్ఎంసికి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు కమ్యూనిటీ హాల్ లను నిర్మాణం చేస్తామని కోరామని తెలిపారు.
మా వైపు నుంచి ప్రయత్న లోపం లేకుండా గత పది సంవత్సరాలుగా ఈ అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సారి అయినా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. శుక్రవారం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి.. లక్డికపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో కోసం విజ్ఞప్తి చేస్తామన్నారు.కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు ఈ అంశంలో డిపిఆర్లు ఇచ్చామన్న కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. పటాన్ చెరు నుంచి హయత్ నగర్ దాకా మెట్రో విస్తరణకు కూడా కేంద్రం సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉత్తర ప్రదేశ్ లో సుమారు 10 చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వము, హైదరాబాద్లో ఎందుకు మెట్రోకి సహకరించడం లేదో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.




Tags:    

Similar News