#AskKTR - ఎన్నికలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధానిపై సెటైర్లు !

భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.100 దాటగా.. వంటగ్యాస్ ధర రూ.1000 దాటిపోవడం పై మంత్రి కేటీఆర్ అభిప్రాయం..

Update: 2022-05-08 10:16 GMT

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో నెటిజన్లతో #AskKTR నిర్వహించారు. #AskKTR హ్యాష్ టాగ్ తో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు కేటీఆర్ జవాబిచ్చారు. వాటిలో తెలంగాణ ఎన్నికల గురించి ఒక నెటిజన్ ప్రశ్నించగా.. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయం అని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తమకు పోటీనే అన్న కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తులను అమ్ముకుంటోందని ఆరోపించారు.

భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.100 దాటగా.. వంటగ్యాస్ ధర రూ.1000 దాటిపోవడం పై మంత్రి కేటీఆర్ అభిప్రాయం చెప్పాలని ఓ నెటిజన్ అడిగాడు. దానిపై స్పందిస్తూ.. 'మోదీ గారిని ఎవ్వరూ ఆపలేరు.. మనం ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉండేలా చూసుకుంటారు' అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి మీరిచ్చే సలహా ఏంటని మరో నెటిజన్ అడగ్గా.. 'ముందుగా రాహుల్ గాంధీ అమేథిలో గెలవాలి.. ఆ తర్వాతే తెలంగాణ గురించి మాట్లాడాలి' అని ఎద్దేవా చేశారు.
అలాగే.. హైదరాబాద్ కు ఐటీఐఆర్ ను ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. కేంద్రం తెలంగాణకు ఏమీ చేయట్లేదన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీ అమ్ముకుంటోందని.. అది ఆ పార్టీ నిజస్వరూపమని చెప్పుకొచ్చారు. కేంద్రంపై రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రజాస్వామ్యంగా పోరాడాలన్నారు.
తెలంగాణలో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించామని ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో కొత్తగా మూడు టిమ్స్‌ ఆస్పత్రులను నిర్మిస్తున్నామన్నారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
శంకరపల్లిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ నెటిజన్ అడగ్గా.. త్వరలోనే వస్తానని కేటీఆర్ తెలిపారు. మరో నెటిజన్ తెలంగాణను అభివృద్ధి చేయడంలో మీకు స్ఫూర్తి ఎవరు అని అడుగగా.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అని తెలిపారు. అలాగే..ఆదిలాబాద్ బీడీఎన్‌టీ ల్యాబ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించగా..జులైలో ప్రారంభిస్తామన్నారు. టీఆర్ఎస్‌ను తెలంగాణ బయట కూడా విస్తరించాలనగా.. భవిష్యత్‌లో ఏం జరగాల్సి ఉందో ఎవరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు.
ఇక గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఉర్దూలో రాసేందుకు అనుమతినివ్వడంపై ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మంత్రి స్పందిస్తూ.. 'తెలుగులాగానే ఉర్దూను కూడా భారత రాజ్యాంగం అధికారిక భాషగా గుర్తించింది. భారత ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు కూడా యూపీఎస్సీతో సహా ఉర్దూలో రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఏ సమస్య లేదు? దయచేసి మతోన్మాదుల ప్రచారానికి ప్రభావితం కావద్దు..' అని మంత్రి కేటీఆర్ సూచించారు. విద్యారంగానికి సంబంధించి పలువురు ప్రశ్నించగా.. వాటికోసం సంబంధిత శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సంప్రదించాలని సూచించారు.

టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఓ ప్రశ్న అడిగారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని మధుర శ్రీధర్ పేర్కొన్నారు. తద్వారా హైదరాబాద్ ను భారతీయ చిత్ర రంగానికి కేంద్రబిందువుగా మార్చవచ్చని సూచించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారని బదులిచ్చారు. కొవిడ్ సంక్షోభం వల్ల తమ ప్రణాళికలు ఆలస్యం అయ్యాయని వివరణ ఇచ్చారు.

కాగా.. కాంగ్రెస్ నేత కొండా సురేఖ కేటీఆర్ ను పలు ప్రశ్నలు అడిగారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారు ? యాదాద్రి నిర్మాణంలో లోపం తప్పిందం ఎవరిది? ఇలా చాలా ప్రశ్నలు అడగ్గా.. కేటీఆర్ ఏ ఒక్క ప్రశ్నకూ బదులివ్వకపోవడం గమనార్హం.


Tags:    

Similar News