దేశంలోనే నంబర్ వన్ ఆస్పత్రిగా గాంధీ

కరోనా పేషెంట్లకు చికిత్స చేసి వారిని కోలుకునేలా చేసిన ఆస్పత్రుల్లో గాంధీ ఆస్పత్రి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.

Update: 2021-12-13 06:21 GMT

రెండేళ్ల క్రితం చైనా లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేసింది. వరుస లాక్ డౌన్లు, ఆంక్షలతో చాలా మంది జీవితాలు తలక్రిందులయ్యాయి. కంటిముందు ఆ రోజు కనిపించిన మనిషి మర్నాటికి కనుమరుగయ్యాడు. కరోనా వైరస్ బారిన పడి కోలుకుని తిరిగి ఇళ్లకు చేరినవారు కొందరైతే.. ఆస్పత్రిలో చేరి.. అట్నుంచి అటే.. కాటికి చేరిన వారు ఎందరో ఉన్నారు. భారత్ లోనూ కోట్లాది మంది వైరస్ బారిన పడ్డారు. అయితే.. దేశంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోకెల్లా.. కరోనా పేషెంట్లకు చికిత్స అందించి.. వారిని కోలుకునేందుకు కృషి చేసిన ఆస్పత్రుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది.

ఫస్ట్ వేవ్ నుంచి...
కరోనా ఫస్ట్ వేవ్ మొదలు.. ఇప్పటివరకూ గాంధీ ఆస్పత్రిలో 84,127 మంది రోగులకు చికిత్స అందించినట్లుగా అక్కడి వైద్యులు వెల్లడించారు. విశేషమేమిటంటే.. దేశంలోని మరే ఆస్పత్రిలోనూ ఇంతమంది రోగులు చికిత్స పొందలేదు. పైగా గాంధీలో కరోనాకు చికిత్స తీసుకున్న వారిలో.. 3,762 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే హైరిస్క్ గ్రూప్ కు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బ్లాక్ ఫంగస్ అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులకు కూడా గాంధీ వైద్యులు చికిత్స చేసి, నయం చేశారు. ఇప్పటివరకూ 1786 మంది బ్లాంగ్ ఫంగస్ తో ఆస్పత్రిలో చేరగా.. వారిలో 1163 మందికి సర్జరీలు చేసి వారి ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. వీటిలో అత్యధిక కేసులు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి వచ్చినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు.



Tags:    

Similar News