దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో భావిస్తూ ఉన్నారు.

Update: 2022-05-20 03:10 GMT

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుండో భావిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్న కేసీఆర్ త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను కలుపుకుని వెళ్లేలా కేసీఆర్ పర్యటన ఉండనుంది.

"జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు." అని సిఎంఓ ట్వీట్ లో తెలిపింది. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. రైతుల హక్కుల కోసం జాతీయ స్థాయి ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సీఎం పరామర్శించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు.
మే 22వ తేదీన మధ్యాహ్నం సీఎం ఢిల్లీ నుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం శ్రీ కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ లతో కలిసి కేసీఆర్ చేపడతారు. గత ఏడాది జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు.
26 మే ఉదయం సీఎంకేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ధి పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. మే 29 లేదా 30న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం సీఆర్ సంసిద్ధం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం ఆదుకోనున్నారు.


Tags:    

Similar News