తవ్వకాల్లో బయటపడిన చార్మినార్ భూగర్భ మెట్లు

తొలుత అధికారులతో మజ్లిస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి విషయం తెలిశాక మజ్లిస్ నేతలు

Update: 2022-02-16 05:55 GMT

చార్మినార్.. భాగ్యనగరంలో ఉన్న అతి ప్రాచీన కట్టడాల్లో ఇదీ ఒకటి. ప్రాచీన కట్టడమే కాదు.. పర్యాటక ప్రదేశం కూడా. హైదరాబాద్ వచ్చిన వారు ఖచ్చితంగా ఈ కట్టడాన్ని చూసే వెళ్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న చార్మినార్ వద్ద ఇటీవల చేపట్టిన తవ్వకాల్లో భూగర్భ మెట్లు బయటపడ్డాయి. చార్మినార్ వద్ద తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న పత్తర్ గట్టీ కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ, మజ్లిస్ నేతలు అక్కడికి వెళ్లి.. తవ్వకాలపై అధికారులను ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు.

తొలుత అధికారులతో మజ్లిస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి విషయం తెలిశాక మజ్లిస్ నేతలు వెనక్కి తగ్గారు. పురాతత్వ సర్వేక్షణ విభాగం హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ స్మిత, చార్మినార్ కన్జర్వేటర్ రాజేశ్వరి తవ్వకాల వెనకున్న కారణాలను వివరించారు. చార్మినార్‌ను పిడుగు ప్రమాదం నుంచి రక్షించేందుకు పురాతత్వ అధికారులు గత కొన్ని రోజులుగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు మీనార్లకు ఇత్తడి తీగలు ఏర్పాటు చేసి వాటిని భూమికి అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టారు. ఆ ప్రక్రియలో భాగంగా జనరేటర్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం తవ్వకాలు చేపట్టగా భూమిలో కూరుకుపోయిన మెట్లు బయటపడ్డాయి.


Tags:    

Similar News