మళ్లీ కవితపై ఫోకస్

ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం

Update: 2023-05-31 01:57 GMT

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి వినిపించింది. ఈ పరిణామాలు చూస్తుంటే కొంచెం గ్యాప్ ఇచ్చాక మళ్లీ కవితపై ఈడీ ఫోకస్ చేసిందని అనిపిస్తూ ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. మంగళవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ఈ సమయంలో కవిత పేరును ఈడీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన వెనుక స్కామ్ ఉందని పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో అరుణ్ పిళ్లై కీలక వ్యక్తి అంటూ వాదనలు వినిపించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు ఈడీ చెప్పుకొచ్చింది. మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కవితకు దాదాపు క్లీన్ చిట్ ఇచ్చినట్లు కూడా ఇటీవల చర్చ జరిగింది. సరిగ్గా రెండు రోజుల్లోనే కవితకు దర్యాప్తు సంస్థలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ వాదనల్లో ఎమ్మెల్సీ కవిత పేరు పదే పదే తెరపైకి వచ్చింది.

ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ నాలుగో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జిషీటులో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై అభియోగాలు మోపింది. దక్షిణాది వ్యక్తులకు, ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని.. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వారికి లబ్ది చేకూర్చేలా పాలసీ రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది. లబ్ది చేకూర్చినందుకు దక్షిణాది వ్యక్తుల నుంచి ఆప్ నేతలకు ముడుపులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు 270 ముఖ్యమైన డాక్యుమెంట్లు, 2 వేల పేజీలతో కూడిన 4వ అదనపు చార్జిషీటును ఈడీ మే మొదటివారంలో దాఖలు చేసింది. నాలుగో చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.


Tags:    

Similar News