బీజేపీ పెరగాలంటే కవిత అరెస్ట్ తప్పదా?

Update: 2023-05-30 12:38 GMT

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోడానికి చాలా కష్టాలే పడుతోంది. ఒకానొక దశలో కాస్త ఊపు అయితే కనిపించింది కానీ.. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందో ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. దానికి తోడు తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక తెలంగాణలో బీజేపీకి పుంజుకునే అవకాశం దక్కాలంటే కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడమే తరువాయి అని అంటున్నారు. కవితను అరెస్టు చేసి.. అక్రమాలకు పాల్పడే వారిని ఎవరినీ విడిచిపెట్టమనే సందేశం ప్రజల్లోకి పంపించాలని భావిస్తున్నట్లు ఉంది. మరో వైపు కల్వకుంట్ల కవిత ఈ అరెస్టులకు భయపడేదే లేదని గతంలో తేల్చేశారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. మంగళవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సమయంలో కవిత పేరును ఈడీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన వెనుక స్కామ్ ఉందని పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో అరుణ్ పిళ్లై కీలక వ్యక్తి అంటూ వాదనలు వినిపించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ చెప్పుకొచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ నాలుగో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జిషీటులో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై అభియోగాలు మోపింది. దక్షిణాది వ్యక్తులకు, ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో దక్షిణాది వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా పాలసీ రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది. లబ్ది చేకూర్చినందుకు దక్షిణాది వ్యక్తుల నుంచి ఆప్ నేతలకు ముడుపులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు 270 ముఖ్యమైన డాక్యుమెంట్లు, 2 వేల పేజీలతో కూడిన 4వ అదనపు చార్జిషీటును ఈడీ మే మొదటివారంలో దాఖలు చేసింది. నాలుగో చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.


Tags:    

Similar News