Weather Report : వాతావరణ శాఖ మరో కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుతోంది
వాతావరణ శాఖ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పొడి వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ, ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వాహనదారులను ఇబ్బందులు పెడుతుంది. అయితే తెలంగాణ, ఏపీ లో ఇప్పటికే వేడిగాలుల ఉధృతి ప్రారంభమవ్వడమే కాకుండా ఉక్కపోత కూడా మొదలయింది.
కొన్ని ప్రాంతాల్లో మాత్రం...
ఆంధ్రప్రదేశ్ లో చలి పూర్తిగా తగ్గింది. మినుములూరు, అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముప్ఫయి డిగ్రీలు దాటేశాయి. రాయలసీమ జిల్లాల్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పల్నాడు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే కనపడుతుంది. రానున్న రోజుల్లో మరింత వాతావరణం వేడెక్కుతుందని అంటున్నారు.
పెరిగిన ఉష్ణోగ్రతలు...
తెలంగాణాలోనూ అక్కడకక్కడ చలిగాలులు ఇంకా వీస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాలో కొంత చలి వాతావరణం నెలకొని ఉందని, మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెల్లవారు జామున మాత్రం కొంత చలి కనపడుతుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ వంటి ప్రాంతాల్లో కొంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఉక్కపోత వాతావరణం మొదలు కావడంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఫ్యాన్లు గిరా గిరా తిరుగుతున్నాయి. 24 గంటలు ఫ్యాన్ వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనిఉంది.