టీడీపీ తాయిలాలు మొదలయ్యాయే.... !!

Update: 2018-12-18 15:30 GMT

విశాఖ జిల్లాతో పాటు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరంలలో మైనారిటీలు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం అపుడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పోయిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక్క మైనారిటీకి కూడా టికెట్ ఇవ్వని ఆ పార్టీ తెగతెంపులయ్యాక మాత్రం ఇపుడు వారిని బాగానే చేరదీస్తోంది. గత ఎన్నికల వేళ టికెట్ ఆశించి భంగపడిన మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ ని విశాఖ జిల్లాలో మళ్ళీ మైనారిటీ నాయకుడిగా ప్రమోట్ చేస్తూ టీడీపీ అయన కోరిన డిమాండ్లను నేరవేరుస్తోంది. ఇందులో భాగంగా మైనారిటీలకు కల్చరల్ సెంటర్ ని ప్రభుత్వం మంజూరు చేసింది.

అయిదు కోట్లతో.....

మైనారిటీలకు కల్చరల్ సెంటర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఉత్తరాంధ్రలోని మైనారిటీలకు చేరువ కావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, అయిదు కోట్ల రూపాయల నిధులను తక్షణం బాబు సర్కార్ కేటాయించడం విశేషం. ఈ కల్చరల్ సెంటర్ కోసం చాలాకాలంగా రహమాన్ పట్టుపడుతున్నారు. ఎట్టకేలకు దాన్ని ఆయన సాధించారని మైనారిటీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది ఈ కల్చరల్ సెంటర్ లో అన్ని రకాలైన ట్రైనింగ్ కేంద్రాలతో పాటు, స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్, పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి శిక్షణ వంటివి ఇస్తారు. ఇక రెండు వేల మంది కూర్చునే విధంగా సమావేశమందిరం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మైనారిటీ అథిదులకు వసతి గ్రుహం, షాపింగ్ కాంప్లెక్స్, అధూఅంతన సాంకేతిక సంపత్తితో ప్రధాన మందిరం వంటివి ఉంటాయి. దీనిని సంబంధించిన పనులు త్వరలోనే మొదలుపెడతారు

టికెట్ ఖాయమేనా....?

ఇక ఉత్తరాంధ్ర నుంచి మైనారిటీలకు ఒకరికి టికెట్ కూడా ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు అధినాయకత్వం సుముఖంగా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక మైనారిటీ కోటాలో రహమాన్ విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును అడుగుతున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. పైగా అయన ఫిషర్ మెన్ కమ్యూనిటీకి చెందినవారు కావడం తో పేచీ వస్తోంది.

కాంగ్రెస్ తో పొత్తు.....

ఇది చాలదన్నట్లుగా కాంగ్రెస్ తో పొత్తు ఉంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ కి సీటు వదులుకోవాల్సి ఉంటుంది. అయితే మైనారిటీల కోసం ఏమైనా చేస్తామని చంద్రబాబు చెబుతున్నందువల్ల ఈసారి రహమాన్ కి టికెట్ ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఆయనకు టికెట్ వచ్చేలా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తెర వెనక చక్రం తిప్పుతున్నారు. మొత్తానికి మైనారిటీలకు ఉమ్మడిగా ఓ కల్చరల్ సెంటర్ తో పాటు, ఆ సామాజికవర్గం నుంచి టికెట్ ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న ఆ వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని సైకిల్ పార్టీ ఎత్తులు వేస్తోంది. మరి చూడాలి ముస్లిం మైనారిటీలు ఏవైపు నిలుస్తారో.

Similar News