Uttar Pradesh : Uttar Pradesh : యమునా నదిలో పడవ మునక.. పది మంది మృతికి అదే కారణమా?
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. మధుర జిల్లాలో నదిలో పడవ మునిగి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. పర్యాటకులతో వెళుతుున్న పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. బృందావన్ లోని యమునా నదిలో పర్యాటకులతో వెళుతున్న పడవ ప్రమాదానికి లోనైంది. పది మంది మరణించారని అధికారులు ధృవీకరించారు. మరికొందరు గల్లంతయ్యారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
సామర్థ్యానికి మించి...
మధుర జిల్లాలోని యమునా నదిలో నిన్నమధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం ఇరవై మంది పర్యాటకులున్నారని అధికారులు తెలిపారు. చనిపోయిన మృతదేహాలను బయటకు తీశామని, వారిని గుర్తించి బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారుల వెల్లడించారు. సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని పడవలో ఎక్కించుకున్నందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రతక్షసాక్షులు తెలిపారు.
అంతా పంజాబ్ వారే...
కాగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ప్రకటించారు. ఇందులో గాయపడిన వారిని కొందరిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేశీఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఉన్నవారంతా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.