Strait of Hormuz : హోర్ముజ్‌ జలసంధిపై పట్టు కోసం అమెరికా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు

Update: 2026-04-13 02:18 GMT

Vice President JD Vance speaks during a news conference after meeting with representatives from Pakistan and Iran, Sunday

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్‌ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుంచి బయలుదేరే నౌకలపై అమెరికా నౌకాదళం తక్షణ నిర్బంధం ప్రారంభిస్తుందని తెలిపారు. పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా–ఇరాన్‌ కాల్పుల విరమణ చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటన ప్రకారం ఈ నిర్బంధం సోమవారం ఉదయం 10 గంటల (ఈడీటీ) నుంచి, ఇరాన్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు అమల్లోకి వస్తుంది. అన్ని దేశాల నౌకలపైనా తటస్థంగా అమలు చేస్తామని పేర్కొంది. అయితే ఇరాన్‌కు చెందని పోర్టుల మధ్య ప్రయాణించే నౌకలకు జలసంధి మార్గం అనుమతిస్తామని స్పష్టం చేసింది. దీంతో మొత్తం జలసంధిని మూసివేయాలన్న అధ్యక్షుడి ప్రారంభ హెచ్చరికతో పోలిస్తే ఈ ప్రకటన కొంత సడలింపుగా కనిపించింది.

ఇరవై శాతం చమురు రవాణా...
ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ జలమార్గం మీద ఆధారపడి ఉంది. యుద్ధం మొదలయ్యే వరకు ఇదే పరిస్థితి. కాల్పుల విరమణ తరువాత కూడా రాకపోకలు పరిమితంగానే ఉన్నాయని సముద్ర ట్రాకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 40కిపైగా వాణిజ్య నౌకలు దాటినట్లు సమాచారం. అమెరికా నిర్బంధం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రకటన తరువాత ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా ముడి చమురు ధర 8 శాతం పెరిగి బ్యారెల్‌కు 104.24 డాలర్లకు చేరగా, బ్రెంట్‌ చమురు 7 శాతం పెరిగి 102.29 డాలర్లకు ఎగిసింది.అదే రోజు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌ మీడియా వేదిక లో పోప్‌పై విమర్శలు చేశారు. విదేశాంగ విధానాలపై కాథలిక్‌ నాయకుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. యుద్ధాన్ని ఖండించి శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చిన పోప్ లియో XIV పై ఈ వ్యాఖ్యలు చేశారు.
“పోరాడితే పోరాడతాం” అన్న ఇరాన్‌...
ఇరాన్‌ విప్లవ గార్డ్‌ ప్రకటనలో జలసంధి తమ పూర్తి నియంత్రణలోనే ఉందని తెలిపింది. సైనికేతర నౌకలకు మార్గం తెరిచి ఉంటుందని, సైనిక నౌకలకు మాత్రం కఠిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఈ వారాంతంలో పాకిస్థాన్‌లో 21 గంటల పాటు జరిగిన చర్చల సమయంలో అమెరికా రెండు డిస్ట్రాయర్‌ నౌకలు మైన్ల తొలగింపు చర్యల ముందు జలసంధి దాటినట్లు అమెరికా సైన్యం తెలిపింది. దీనిని ఇరాన్‌ ఖండించింది.లండన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్ కు చెందిన భద్రతా అధ్యయనాల నిపుణుడు ఆండ్రియాస్ క్రీగ్ అభిప్రాయం ప్రకారం నౌకాదళంతో జలసంధిని పూర్తిగా అడ్డుకోవడం ఆచరణ సాధ్యం కాదన్నారు. సైనిక ఒత్తిడితో లక్ష్యం సాధించలేరని చెప్పారు. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ దేశానికి చేరుకున్న తర్వాత “పోరాడితే పోరాడతాం” అని ట్రంప్‌కు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్ మాట్లాడుతూ “ఇరాన్‌ అణ్వస్త్రాలు అభివృద్ధి చేయబోదన్న స్పష్టమైన హామీ కావాలి” అన్నారు.
కాల్పుల విరమణ గడువు తర్వాత ?
1979 ఇస్లామిక్‌ విప్లవం తరువాత ఇరుదేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ముఖాముఖి చర్చలుగా ఇవి గుర్తింపు పొందాయి. అయితే ఏప్రిల్‌ 22న కాల్పుల విరమణ గడువు ముగిసిన తరువాత ఏం జరుగుతుందో ఇరువైపులా స్పష్టత ఇవ్వలేదు.అమెరికా అధికారులు పేర్కొన్న ‘రెడ్‌ లైన్స్‌’లో అణ్వస్త్రాలు తయారు చేయకూడదనే నిబంధనతో పాటు యురేనియం శుద్ధి నిలిపివేత, ప్రధాన శుద్ధి కేంద్రాల తొలగింపు, అధిక శుద్ధి యురేనియం స్వాధీనం, హోర్ముజ్‌ మార్గం తెరవడం, హమాస్‌, హిజ్బుల్లా, హౌతీలకు నిధులు నిలిపివేయడం ఉన్నాయి. కొన్ని కీలక అంశాలపై అమెరికా అతిగా ఒత్తిడి తెచ్చిందని ఇరాన్‌ వర్గాలు ఆరోపించాయి.
పాక్ మాత్రం...
పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ త్వరలో మరోసారి చర్చకు తమ దేశం సహకరిస్తుందని చెప్పారు. ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధమని తెలిపింది. యూరోపియన్‌ యూనియన్‌ కూడా రాజదౌత్య ప్రయత్నాలు కొనసాగాలని కోరింది. హోర్ముజ్‌ దక్షిణ తీరంలో ఉన్న ఒమాన్‌ విదేశాంగ మంత్రి ఇరుపక్షాలు ‘వేదన కలిగించే రాజీ’కి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కూడా మధ్యవర్తిత్వానికి సిద్ధమని తెలిపారు.
అణు కార్యక్రమమే...
ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభానికి ముందే ఇరాన్‌ అణు కార్యక్రమం ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉంది. ఇరాన్‌లో కనీసం 3,000 మంది, లెబనాన్‌లో 2,055 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌ దేశాల్లో పలువురు మరణించినట్లు సమాచారం. అనేక దేశాల్లో మౌలిక సదుపాయాలకు నష్టం జరిగింది. ఇరాన్‌ పౌర అణు కార్యక్రమ హక్కు తమకు ఉందని చెబుతూ, అణ్వస్త్రాల ప్రయత్నం చేయలేదని చెబుతోంది. 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చిన తరువాత పరిస్థితి మారిందని నిపుణులు అంటున్నారు. అధిక శుద్ధి యురేనియం నిల్వలు సాంకేతికంగా అణ్వస్త్రాలకు దగ్గర దశలో ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లెబనాన్‌లో ఉద్రిక్తత...
ఇరాన్‌ ప్రతిపాదించిన 10 అంశాల్లో లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు నిలిపివేయాలని డిమాండ్‌ ఉంది. అయితే అక్కడ కాల్పుల విరమణ వర్తించదని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఆదివారం ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహూ దక్షిణ లెబనాన్‌లో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలను సందర్శించారు. చర్చలు మంగళవారం వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం బీరూట్‌పై జరిగిన వైమానిక దాడుల్లో 300కుపైగా మంది మృతి చెందారు. తీర నగరం టైర్‌ సమీపంలోని మారూబ్‌ గ్రామంలో ఆదివారం ఆరుగురు మరణించినట్లు లెబనాన్‌ జాతీయ వార్తా సంస్థ తెలిపింది.


Tags:    

Similar News