జగన్ టూర్…అందుకేనా…?

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తిన ప్రయాణం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. జగన్ ఇప్పటి వరకూ పెద్దగా [more]

Update: 2019-02-03 02:30 GMT

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తిన ప్రయాణం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. జగన్ ఇప్పటి వరకూ పెద్దగా ఢిల్లీ వెళ్లి అక్కడి జాతీయ నేతలను కలిసింది లేదనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఒకసారి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మరొకసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీని కలసి వచ్చారు. అంతే తప్ప జగన్ నేరుగా వెళ్లి ఢిల్లీలో ఒకరోజు మకాం వేయడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. ఆయన వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏపీకే ఎక్కువ పరమితమయ్యారు.

చాలా రోజుల తర్వాత….

పాదయాత్ర ద్వారా ఇప్పటికే ఏడాది పాటు ఆయన రాష్ట్రంలోనే ఉన్నారు. అంతే తప్ప ఆయన ఎప్పుడూ హస్తిన వైపు పెద్దగా చూడలేదనే చెప్పాలి. అయితే తాజాగా ఏపీలోనూ, జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో జగన్ హస్తినకు బయలుదేరుతున్నారు. ఈ నెల 4వ తేదీన జగన్ హస్తినలో ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. బీజేపీయేతర కూటమిని కట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

జాతీయ నేతలను….

అయితే జగన్ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, అప్పుడు ఏపీ ఎంపీల అవసరం ఆయా పార్టీలకు ఉంటుందని నమ్ముతున్నారు. అలాంటి సమయంలో ఎన్నికల తర్వాత ఎవరైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో? వారికే తన మద్దతు ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనలో ఏఏ జాతీయ పార్టీల నేతలను కలుస్తారన్న చర్చ పార్టీలోనూ జోరుగా సాగుతోంది.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని….

ప్రధానంగా ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా చేసేందుకు జగన్ ఢిల్లీ పర్యటన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విజయనగరం, కడప జిల్లాల్లో సర్వేల పేరుతో వైసీపీ ఓట్లను తొలగించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల తొలగింపు అంశాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలపై జాతీయ నేతలతో చర్చించడమే కాకుండా రాష్ట్రపతిని కూడా జగన్ కలిసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, కేటాయింపు లు చేరాలని ఆర్థికమంత్రిని కూడా జగన్ కలుస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News