తాడేపల్లి పిలుస్తుంది.. రా కదలిరా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పార్టీపై దృష్టి పెట్టినట్లే కనపడుతుంది. ఇప్పటి వరకూ పార్టీని పట్టించుకోని జగన్ ఇకపై పార్టీలో విభేదాలను పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. [more]

Update: 2020-12-07 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పార్టీపై దృష్టి పెట్టినట్లే కనపడుతుంది. ఇప్పటి వరకూ పార్టీని పట్టించుకోని జగన్ ఇకపై పార్టీలో విభేదాలను పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే విభేదాలు తలెత్తిన కొన్ని నియోజకవర్గాల నేతలతో జగన్ మాట్లాడినట్లు తెలిసింది. ప్రధానంగా వీధికెక్కిన విభేదాలపై జగన్ వెంటనే స్పందిస్తున్నారు. అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి భారీ డ్యామేజీ జరుగుతుందని భావించిన జగన్ వెంటనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

రాజధాని అనుకుంటుంటే?

కొద్దికాలం క్రితం విశాఖ డీఆర్సీ మీటింగ్ లో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాధ్, కరణం ధర్మశ్రీల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. డీఆర్సీ మీటింగ్ కావడంతో వెంటనే బయటకు పొక్కింది. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నేతల మధ్య వివాదానికి కారణమయ్యాయి. విశాఖకు పరిపాలన రాజధానిని తరలించాలనుకుంటే ఈ వివాదం జగన్ కు తలనొప్పిగా మారింది. వెంటనే తాడేపల్లికి నేతలను పిలిపించి క్లాస్ పీకి సెట్ చేశారు.

రచ్చకెక్కడంతో….

తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిల మధ్య వివాదం జరిగింది. ఇది కూడా డీఆర్సీ సమావేశంలోనే జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం రచ్చ కెక్కింది. దీంతో జగన్ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించి గట్టిగా హెచ్చరించారని తెలిసింది. దీంతోనే బోస్ ద్వారంపూడి ఇంటికి వెళ్లి మరీ తమ మధ్య సయోధ్య ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా జగన్ ఈ వివాదాన్ని కూడా తొలిదశలోనే తుంచి వేయగలిగారు.

నియోజకవర్గాల వారీగా….

దీంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సమయం కేటాయిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే కొన్ని నియోజకవర్గాల పంచాయతీని జగన్ తేల్చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ విభేదాల ప్రభావం పడకుండా ఉండేందుకు రానున్న రెండు, మూడు నెలల్లో అన్ని నియోజకవర్గాలను సెట్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. అప్పటికీ మాట వినకపోతే పార్టీ నుంచి పంపిచేయాలని కూడా జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News