ఆయన నిర్ణయమే ఫైనల్.. జగన్ డెసిషన్

స‌ర్వవిధ భ్రష్టత్వంతో అల్లాడుతున్న విశాఖప‌ట్నం వైసీపీ రాజ‌కీయాల‌కు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌న‌దైన మార్కు ప‌రిష్కారం చూపించారా ? ఇక్కడి నేత‌ల‌కు త‌న‌దైన శైలిలో హెచ్చరిక‌లు [more]

Update: 2020-11-14 13:30 GMT

స‌ర్వవిధ భ్రష్టత్వంతో అల్లాడుతున్న విశాఖప‌ట్నం వైసీపీ రాజ‌కీయాల‌కు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌న‌దైన మార్కు ప‌రిష్కారం చూపించారా ? ఇక్కడి నేత‌ల‌కు త‌న‌దైన శైలిలో హెచ్చరిక‌లు జారీ చేశారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌డిచిన కొన్నాళ్లుగా విశాఖ వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విజ‌య‌సాయి రెడ్డి కేంద్రంగా వైసీపీ నాయ‌కులు , ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ నేత‌లు కూడా తీవ్ర విమ‌ర్శలు గుప్పిస్తున్న విష‌యం తెలి‌సిందే. భూములు ఆక్రమించార‌ని, సాయిరెడ్డి అల్లుడు.. ఇక్కడ ఫార్మా, ఐటీ కంపెనీల‌ను త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకున్నార‌ని నాయ‌కులు విమ‌ర్శలు చేస్తున్నారు.

సాయిరెడ్డి లక్ష్యంగా…..

ఇదే విష‌యంపై కొన్నాళ్లుగా విమ‌ర్శలు సాగుతున్నా.. ఇటీవ‌ల అత్యంత కీల‌క‌మైన నాయ‌కులు చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మశ్రీ, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ కూడా విరుచుకుప‌డ్డారు. “త‌ప్పులు చేస్తోందెవ‌రో.. తేల్చేయాలి“ అంటూ. వారు విమ‌ర్శలు గుప్పించారు. ఇదంతా కూడా సాయిరెడ్డిని దృష్టిలో పెట్టుకునే చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. ఈ ప‌రిణామంతో ఒక్కసారిగా సాయిరెడ్డి కేంద్రం‌గా విమ‌ర్శలు పెరిగేందుకు మ‌రింత అవ‌కాశం వ‌చ్చిన‌ట్టయింది. అయితే, పార్టీలో కీల‌క నేత‌, త‌న త‌ర్వాత పార్టీని న‌డిపిస్తున్న నాయ‌కుడుగా ఉన్న సాయిరెడ్డిపై త‌న‌కు వ్యక్తిగ‌తంగా కావాల్సిన నాయ‌కులే విమ‌ర్శలు చేయ‌డంతో ఈ వివాదం మ‌రింత ముదురుతుంద‌నుకున్న సీఎం జ‌గ‌న్‌.. వెంట‌నే వారిని తాడేప‌ల్లికి పిలిచి చ‌ర్చించారు.

గట్టి వార్నింగ్…

అయితే.. ఈ చ‌ర్చల‌కు సంబంధించి రెండు వాద‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ప్రధాన మీడియాలో వ‌చ్చిన వివ‌ర‌ణ‌, సీఎం జ‌గ‌న్ నేత‌ల‌కు స‌ర్దిచెప్పారు అనే వాద‌న‌ను వైసీపీ సీనియ‌ర్లు కొట్టిపారేస్తున్నారు. ఇది అస‌లు చ‌ర్చకే రాలేద‌ని.. జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించార‌ని అంటున్నారు. ఏక‌ప‌క్షంగానే జ‌గ‌న్ మాట్లాడార‌ని.. సాయిరెడ్డికే ప‌గ్గాలు అప్పగిస్తున్నాం.. అంతా ఆయ‌న క‌నుస‌న్నల్లోనే ఉండాల‌ని.. ఇష్టమైతే.. పార్టీలో ఉండండి లేక‌పోతే.. మీదారి మీరు చూసుకోండి అని గ‌ట్టిగానే హెచ్చరించిన‌ట్టు చెబుతున్నారు.

జగన్ డెసిషన్….

అంతేకాదు.. పార్టీలో సాయిరెడ్డి తీసుకునే నిర్ణయ‌మే ఫైన‌ల్ అని కూడా చెప్పడం… ద్వారా.. ఇప్పటి వ‌ర‌కు సాయిరెడ్డి అంటే.. ఒక విధ‌మైన భావ‌న‌తో ఉన్న నేత‌ల‌కు గ‌ట్టి సంకేతాల‌నే పంపించార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో సాయిరెడ్డిపై మ‌చ్చ ప‌డ‌కుండా జ‌గ‌న్ కాపాడేశార‌ని చెబుతున్నారు. దీంతో విశాఖ వైసీపీ నేత‌ల నళ్ల‌కు తాళం ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌నే ఇంత తీవ్రంగా సాయిరెడ్డిని స‌మ‌ర్ధించాక ఎవ‌రు మాత్రం నోరు మెదుపుతారు..?

Tags:    

Similar News