డిఫెన్స్ లో పడేశారే?

అవును… రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇప్పుడు ఏపీలోనూ అదే జ‌రిగింది. రాష్ట్ర సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ఒకే ఒక్క [more]

Update: 2019-12-20 14:30 GMT

అవును… రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇప్పుడు ఏపీలోనూ అదే జ‌రిగింది. రాష్ట్ర సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ఒకే ఒక్క ప్రక‌ట‌న అన్నిపార్టీల‌నూ ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఆయ‌న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. నిన్న మొన్నటి వ‌ర‌కు తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ ఇప్పుడు తేలుకుట్టిన దొంగ‌ల్లా వ్యవ‌హ‌రించ‌క త‌ప్పని ప‌రిస్థితిలోకి జ‌గ‌న్ వారిని నెట్టేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు అమరావ‌తి అనే ప్రచారం జోరుగా ఉంది. అయితే, దీనిని ఇప్పుడు మూడు ప్రాంతాల‌కు విస్తరించేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నిస్తున్నారు.

అనుకుంటున్నా అని అన్నా….

ఇదే విష‌యాన్ని జగన్ తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల్లో వెల్లడించి సంచ‌ల‌నం రేపారు. పైకి ఆయ‌న అనుకుంటున్నాను.. అని మాత్రమే చెప్పినా.. చివ‌రిలో మాత్రం ప్రాంతీయ అభివృద్ధి, అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగానే తాను రాజ‌ధానిని మూడు ప్రాంతాల‌కు విస్తరించాల‌ని భావిస్తున్న ట్టు జ‌గ‌న్ వెల్లడించారు. అయితే, అదే స‌మ‌యంలో ఈ విష‌యంపై జీఎన్ రావు క‌మిటీ అధ్యయ‌నం చేస్తోంద‌ని చెప్పారు. అయితే, మూడు ప్రాంతాల‌కు రాజ‌ధానిని విస్తరించాల‌నే ప్రణాళిక ఎలా ఉన్నప్ప టికీ.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు మాత్రం ఇప్పుడు ఆ అవ‌కాశం లేకుండా పోయింద‌నే భావ‌న తెర‌మీద‌కి వ‌చ్చింది.

రాజకీయంగా ఇబ్బందులేనా?

అయితే, మూడు ప్రాంతాల్లో రాజధాని ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించారు. పరిపాలనా వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమని, అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి వున్నామని స్పష్టం చేశారు. అంటే మూడు రాజధానుల ప్రతిపాదనకు తెలుగుదేశం వ్యతిరేకం. అమరావతిలోనే రాజధాని వుండాలని పట్టుబడుతోంది టీడీపీ. ఈ నిర్ణయంతో మిగతా రెండు ప్రాంతాల్లో తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బంది తప్పదని రాజకీయ పండితుల విశ్లేషణ. తమ ప్రాంతానికి రాజధాని ఎందుకు వద్దంటున్నారని జనం టీడీపీ మీద రగిలిపోవచ్చు. వైజాగ్‌లో సెక్రటేరియట్‌ ప్రతిపాదన అనగానే, అక్కడ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనం.

తలూపక తప్పదా?

రాజధాని వికేంద్రీకరణకు టీడీపీ వ్యతిరేకమని తేల్చడంతో, ఉత్తరాంధ‌్ర టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యతిరేకిస్తే, సొంత ప్రాంతంలోనే ఇబ్బందికర వాతావరణం తప్పదు. జనం ఎదురు తిరిగే ఛాన్సుంది. అటు జనసేన సైతం, జగన్‌ ప్రకటనతో ఇరకాటంలో పడినట్టయ్యింది. సేమ్‌ టీడీపీకి ఉన్న ఇబ్బందే జనసేనది కూడా. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాలనా వికేంద్రీక రణను వ్యతిరేకించారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి గానీ, రాజధానుల వికేంద్రీకరణ కాదని ప్రకటించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిలోనే సీడ్ క్యాపిటల్ ఉండాలని చెప్పారు. మొత్తంగా ఈ ప‌రిస్తితిని పైకి విమ‌ర్శిస్తున్నా.. సుదీర్ఘ రాజ‌కీయ ప్రయోజ‌నం చూస్తే.. మాత్రం ఈ పార్టీలు త‌ల‌లూప‌క త‌ప్పద‌నే భావ‌న మాత్రం తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News