పవన్ తేల్చేస్తారా? పొత్తుపై స్పష్టత రానుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీని [more]

Update: 2021-01-16 06:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీని కట్టడి చేయకుంటే భవిష్యత్ లోనూ ఇబ్బందులు తప్పవని ఆయన తెలుసుకున్నట్లుంది. అందుకే జనసేన అభ్యర్థి బరిలో ఉండేందుకే పవన్ కల్యాణ్ ఇష్టపడుతున్నారు. ఈనెల 21వ తేదీనతిరుపతితో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

బేషరతుగా చేరినా….?

బీజేపీలో బేషరతుగా చేరినందుకు తమను చిన్న చూపు చూస్తుందని జనసైనికులు సయితం భావిస్తున్నారు. తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమ మద్దతును తీసుకుని స్థానాలను కేటాయించకపోవడంపై పవన్ కల్యాణ్ గుర్రుగా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో అది పునరావృతం కాకూడదని భావించిన పవన్ కల్యాణ్ బీజేపీ వెళ్లి పార్టీ పెద్దలను కలసి వచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ఉమ్మడి అభ్యర్థి కోసం సమన్వయ కమిటీని నియమిస్తామని జేపీ నడ్డా తెలిపారు.

సోము ప్రకటనతో….?

అయితే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని సోము వీర్రాజు ప్రకటన కూడా పవన్ కల్యాణ‌్ కు ఆగ్రహం తెప్పించింది. తిరుపతి పార్లమెంటు పరిధిలో బీజేపీతో పోలిస్తే జనసేనకే బలం ఎక్కువగా ఉంది. అందుకే తాము బరిలోకి దిగడమే సమంజసమని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం లోక్ సభ ఎన్నిక కావడంతో తామే పోటీ చేస్తామని బీజేపీ చెబుతూ వస్తుంది. పవన్ కల్యాణ్ ను కన్విన్స్ చేస్తామని, చేయగలమని బీజేపీ ధీమాగా ఉంది.

అటో … ఇటో…?

తమ ప్రమేయం లేకుండానే తిరుపతి పార్లమెంటు పరిధిలో బీజేపీ ఇన్ ఛార్జులను నియమించడం, పోటీకి రెడీ అయిపోవడంతో పవన్ కల్యాణ్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ పెద్దలను ఒప్పించి అయినా సరే ఈ ఎన్నికల్లో తామే బరిలో ఉండాలని పవన్ కల్యాణ‌ భావిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ‌్ గట్టిగా పట్టుబడితే బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. బీజేపీ పవన్ కల్యాణ్ ను ఒప్పించగలదా? లేకుంటే పొత్తుపై ప్రభావం పడనుందా? అన్నది ఈ నెల 21 వ తేదీన తేలిపోనుంది.

Tags:    

Similar News