త‌ల్లి చాటు త‌న‌యుడు… పాలిటిక్స్ లో పుంజుకునే దెప్పుడు..?

ఆయ‌న త‌ల్లి చాటు త‌న‌యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌ల్లి వేసిన రాజ‌కీయ అడుగులే ఆలంబ‌న‌గా.. ఆయ‌న అడుగులు క‌దిపారు. గత ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి టికెట్ సంపాయించుకున్నారు. [more]

Update: 2020-07-17 00:30 GMT

ఆయ‌న త‌ల్లి చాటు త‌న‌యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌ల్లి వేసిన రాజ‌కీయ అడుగులే ఆలంబ‌న‌గా.. ఆయ‌న అడుగులు క‌దిపారు. గత ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి టికెట్ సంపాయించుకున్నారు. కానీ, ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రి ఇప్పటి వ‌ర‌కు త‌న త‌ల్లినే న‌మ్ముకుని రాజ‌కీయాలు చేసి.. ఆ కుమారుడు.. త‌న‌కంటూ.. ఏమైనా పునాది వేసుకున్నారా ? త‌న‌కంటూ.. నియో జక‌వ‌ర్గంలో ప్రత్యేక‌త‌ను సంత‌రించుకుని.. సొంతం చేసుకున్నారా ? అంటే లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించి, త‌న‌కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు గుమ్మడి కుతూహ‌లమ్మ.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో…..

ఎస్సీ వ‌ర్గానికి చెందిన కుతూహ‌ల‌మ్మ కాంగ్రెస్‌లో త‌న‌కంటూ.. ప్రత్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. 1981లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబునాయుడు కుతుహలమ్మ జిల్లా పరిషత్ ఛైర్మెన్ ను చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1985, 1989, 2004లలో వేపంజేరి నియోజకవర్గం నుండి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో వేపంజేరి నియోజకవర్గం స్థానంలో గంగాధర నెల్లూరు స్థానం ఏర్పాటైంది. దీంతో ఈ స్థానం నుండి కుతుహలమ్మ విజయం సాధించారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన స‌మ‌యంలో సుదీర్ఘప్రస్థానం ఉన్న తన‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని కుతూహ‌లమ్మ భావించారు. కానీ, వైఎస్ కోట‌రీకి దూరంగా ఉండ‌డంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.

వైసీపీలోకి వెళ్దామనుకున్నా….

చివ‌ర‌కు సోనియా గాంధీ చొరవతో కుతుహలమ్మకు 2009లో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కించుకున్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సైలెంట్ అయిన కుతూహ‌లమ్మ.. త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడి బ‌య‌టకు వ‌చ్చారు. అప్పటికే వృద్ధాప్య స‌మ‌స్యల‌తో ఉన్న ఆమె.. త‌న‌వార‌సుడిగా.. కుమారుడు హ‌రికృష్ణకు అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణయించుకుని, పార్టీ మారి టీడీపీ చెంత‌కు చేరిపోయారు. నిజానికి హరికృష్ణ వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ, వైఎస్‌తో గ‌తంలో ఉన్న విభేదాల కార‌ణంగా.. కుతూహ‌లమ్మ వ‌ద్దని వారించ‌డంతో ఆయ‌న టీడీపీ వైపు మొగ్గారు. 2014లోనే కుమారుడిని పోటి చేయించాల‌ని అనుకున్నా టీడీపీ అధినేత చంద్రబాబు కుతూహ‌ల‌మ్మకు ఛాన్స్ ఇచ్చారు.

మంత్రిగా ఉండటంతో….

అయితే, ఆ ఎన్నిక‌ల్లో కుతూహ‌లమ్మ ఓడిపోయారు. త‌ర్వాత ఎమ్మెల్సీ కోసం ఎదురు చూసినా.. బాబు క‌రుణించ‌లేదు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబట్టి కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారు. అయితే, జ‌గ‌న్ సునామీలో హ‌రికృష్ణ గెలుపు గుర్రం ఎక్కలేక పోయా రు. దాదాపు 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. రాజ‌కీయంగా టీడీపీ పెద్దగా దూకుడు లేక‌పోవ‌డం, ఇక్కడ నుంచి గెలిచిన నారాయ‌ణ స్వామి మంత్రిగా చ‌క్రం తిప్పుతుండ‌డం వంటి కార‌ణాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో హ‌రికృష్ణ హవా ఎక్కడా క‌నిపించ‌డం లేదు.

సొంతంగా రాజకీయాలు చేయడం….

పైగా నారాయ‌ణ స్వామి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కుతూహ‌ల‌మ్మతో పాటు ఇటు హ‌రికృష్ణను సైతం ఓడించారు. ఆయ‌న ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండ‌డంతో అస‌లు ప్రతిప‌క్షం అనే ప‌దానికే స్కోప్ లేకుండా చేస్తున్నారు. ఇక కూతుహ‌ల‌మ్మ రాజ‌కీయాల‌కు దూరం కావ‌డంతో టీడీపీలో ఉన్నా ఉప‌యోగం లేద‌ని భావిస్తోన్న వైసీపీ వైపు చూస్తున్నార‌న్న వార్తలు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా ఇప్పట‌కీ హ‌రికృష్ణకు సొంతంగా రాజ‌కీయం చేయ‌డం రాలేద‌న్న చ‌ర్చలే ఉన్నాయి. అందుకే త‌ల్లి చాటు బిడ్డగానే ప్రజ‌లు ఆయ‌న‌ను ఇప్పటికీ చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ వార‌సుడి క‌థ కంచికే అనే వ్యాఖ్యలు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News