బుజ్జగింపులు..తాయిలాలు..స్టార్టయ్యాయిగా…!!

వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు ఏకంగా ముగ్గురు వ‌ర‌కు కూడా నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఎవ‌రికి వారే తామంటే [more]

Update: 2019-01-25 13:30 GMT

వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక‌రు కాదు ఇద్ద‌రుకాదు ఏకంగా ముగ్గురు వ‌ర‌కు కూడా నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఎవ‌రికి వారే తామంటే తామంటూ.. పోటీ కి దిగుతున్నారు. ముఖ్యంగా ఈ పోటీ.. అధికార పార్టీ టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. నాయ‌కులు ఎవ‌రికి వారే టికెట్ కోసం త‌న్నులాడుతున్నారు. దీంతో ఎవ‌రికి టికెట్ ఇస్తే.. ఏమ‌వుతుంది? ఎవ‌రు రెబ‌ల్ గా మార‌తారు? ఎవ‌రు పార్టీకి వ్య‌తిరేకంగా అడుగులు వేస్తారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి తిరిగి రావాల‌ని భావిస్తున్న చంద్ర‌బాబుకు ఈ ప‌రిణామం.. మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది. దీంతో ఆయ‌న ఇలా పోటీ ప‌డేవారిని పిలిచి బుజ్జ‌గించ‌డం అప్పుడే ప్రారంభించారు.

స్పీడ్ పెంచిన బాబు…..

నాపై నమ్మకం ఉంచండి. నేను సూచించే అభ్యర్ధికి మద్దతు ఇచ్చి, గెలిపించుకోండి. అలా నడుచుకునే నేతలకి వెంటనే ఏదో ఒక పదవి తప్పక ఇస్తా అని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు వాదనతో ఎక్కువమంది ఏకీభవిస్తున్నారు. పార్టీపరంగా ఒకేసారి దాదాపు 90 నియోజకవర్గాల్లో శాసనసభ అభ్యర్ధులను, 15 నుంచి 20 లోక్‌సభ స్థానాల అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తున్నారు. రెండవ విడతలో అభ్యర్ధులందరినీ ప్రకటిస్తే నియోజకవర్గాల్లో వారు చురుకుగా పనిచేసుకుంటారని హైకమాండ్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే చంద్రబాబు పార్టీ వర్క్‌లో స్పీడుపెంచారు. ఈ నేప‌థ్యంలోనే జిల్లాల వారీగా పార్టీ అభ్యర్ధుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టి సారించారు.

90 నియోజకవర్గాల్లో…..

సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరిని కొనసాగించాలి? ప్రజావ్యతిరేకత ఉన్నవారి స్థానంలో ఎవరిని బరిలోకి దించాలి? టిక్కెట్‌ లభించని నేతలకి ఎలా సర్థిచెప్పాలి? అనే అంశాలపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే అలాంటి నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీలో ఉన్న అంతర్గత సమరాలపైనా ఆరాతీస్తున్నారు. గొడవలు పడుతున్న నేతలను తనవద్దకే పిలిపిస్తున్నారు. తన సమక్షంలోనే వారితో మాట్లాడిస్తున్నారు. ఇప్పటికే సుమారు 90 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. లోక్‌సభకి సంబంధించి మెజారిటీ నియోజకవర్గాలపైనా ఏకాభిప్రాయానికి వచ్చారు. చిక్కుముడిగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్ధులను పిలిపించి మాట్లాడుతున్నారు.

టిక్కెట్ ఇవ్వలేనంటూ….

ప్రజావ్యతిరేకత ఉన్న నేతలకి టిక్కెట్‌ ఇవ్వలేనని తెగేసి చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడకపోతే.. వారిపై వేటు వేసేందుకైనా సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి , అధికారంలోకి రావాలంటే అందరి సహకారం అవసరమని చంద్రబాబు స్పష్టంచేస్తున్నారు. పార్టీ మళ్లీ గద్దెనెక్కితేనే ఎవరికైనా పదవులు వస్తాయని ఆయన పార్టీ నేతలకు విశదీకరిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా నాలుగు మార్గాల నుంచి సర్వే నివేదికలు రప్పించుకుంటున్నారు. ఆయా ఫలితాలను క్రోడీకరించి అభ్యర్ధుల చేతుల్లో పెడుతున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని వారికి సూచిస్తున్నారు. దీంతో టిక్కెట్లు దక్కవని తెలిసిన నేతలు కూడా ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు వేసిన పాచిక అసంతృప్తుల‌పై బాగానే ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News