జీరో లెవెల్ కు పడిపోయారే

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా హ‌వా చ‌లాయించాల‌ని ప్రయ‌త్నించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు కొన్నాళ్లు బాగానే ఉన్నా.. త‌ర్వాత మాత్రం ఆయ‌నను ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి [more]

Update: 2019-11-16 12:30 GMT

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా హ‌వా చ‌లాయించాల‌ని ప్రయ‌త్నించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు కొన్నాళ్లు బాగానే ఉన్నా.. త‌ర్వాత మాత్రం ఆయ‌నను ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. వాస్తవానికి 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలోకి రావాలి.. రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ మిత్రప‌క్షం అధికారంలోకి రావా లంటూ వేదిక‌లెక్కి ప్రక‌టించారు. ప్రజ‌లకు పిలుపునిచ్చారు. ఇక‌, ప్రధాని న‌రేంద్ర మోదీతోనూ ఆయ‌న వేదిక‌లు పంచుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

మోదీకి వ్యతిరేకంగా….

అంతేకాదు, 2018 వ‌ర‌కు కూడా బీజేపీని వ్యతిరేకించిన పార్టీల‌తో చంద్రబాబు కూడా దూరం పాటించారు. ఇక‌, ఆ త‌ర్వాత మాత్రం ఎప్పుడైతే.. బీజేపీకి త‌న‌కు చెడిందో అప్పటి నుంచి ఆయ‌న జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించిన‌, మోదీని వ్యతిరేకించిన నాయ‌కుల‌తో పొత్తు పెట్టుకుని రోడ్డెక్కారు. ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్ సీఎంల‌తో క‌లిసి మోదీని ఎన్నిక‌ల్లో ఓడించే వ‌ర‌కు కూడా తాను నిద్రపోన‌ని చంద్రబాబు శ‌ప‌థం చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్యటించి మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ప‌నిచేశారు. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ చంద్రబాబు దూకుడు ప్రద‌ర్శించి ప్రచారం చేశారు.

ప్రాంతీయానికే పరిమితం….

అయితే, చంద్రబాబు ఆశించింది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి. మోదీ పోవాల‌ని అనుకున్నా.. ఆయ‌న విజృంభించి మ‌రీ గెలిచారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. దీంతో జాతీయ నేత కాస్తా ప్రాంతీయానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇంకా చెప్పాలంటే ఒక‌ప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా ఉండి దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన చంద్రబాబు నేడు కేవ‌లం 25 ఎంపీ సీట్లు ఉన్న ఆంధ్రా ప్రాంతానికి ప‌రిమిత‌మైపోయారు. ఆంధ్రాలో కూడా పార్టీ చ‌రిత్రలోనే లేనంత ఘోర‌మైన స్థితికి దిగ‌జారిపోయింది.

ఈయన అవసరం ఎవరికీ లేక….

ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్నవే మూడు లోక్‌స‌భ సీట్లు. ఇక ఎన్నిక‌లు అయ్యాక న‌లుగురు రాజ్యస‌భ స‌భ్యులు బీజేపీకి జై కొట్టేశారు. దీంతో అంత‌కు ముందు చంద్రబాబుకు జాతీయ స్థాయిలో చంద్రబాబును ప‌ట్టించుకున్న నాయ‌కులు కూడా ఆయ‌నను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఇక చంద్రబాబు కూడా కాంప్రమైజ్ అయిపోయిన ప‌రిస్థితినే తెచ్చుకున్నారు. బీజేపీతో మ‌ళ్లీ చేయి క‌లిపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో చంద్రబాబుపై విమ‌ర్శలు కూడా వ‌చ్చాయి. మొత్తంగా చంద్రబాబు ఊహించింది ఒక‌టైతే.. జ‌రిగింది మ‌రొక‌ట‌నే విష‌యం వెల్లడైంది. ప్రస్తుతం చంద్రబాబు అవ‌స‌రం కూడా ఎక్కడా ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. దీంతో జాతీయ స్థాయిలో చంద్రబాబు జీరో అయ్యార‌ని అంటున్నారు విమ‌ర్శకులు.

Tags:    

Similar News