భయపడిపోయారా? లాక్ చేద్దామనుకుంటున్నారా?

టీడీపీ ఇక‌, ఏపీకి మాత్రమే ప‌రిమిత‌మా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు ఔన‌నే అంటున్నారు. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న [more]

Update: 2020-04-20 13:30 GMT

టీడీపీ ఇక‌, ఏపీకి మాత్రమే ప‌రిమిత‌మా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు ఔన‌నే అంటున్నారు. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న టీడీపీని విభ‌జన త‌ర్వాత పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ పార్టీగా ప్రక‌టించారు. నిజానికి జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించ‌లేదు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. క‌నీసం నాలుగు రాష్ట్రాల్లో ఓటు షేరింగ్ తోపాటు ఎంపీల సంఖ్య కూడా ఉండాలి. ఇవేవీ టీడీపీకి లేవు. అయినా కూడా ఆయ‌న ప్రక‌టించారు. త‌న‌ను తాను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రక‌టించుకున్నారు. ఇక‌, తన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ పార్టీకి జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు.

నాలుగు రాష్ట్రాల్లో…..

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి జాతీయ పార్టీ అంటే.. పైన చెప్పుకొన్నట్టుక‌నీసం నాలుగు రాష్ట్రాల్లో యాక్టివిటీ అయినా ఉండాలి క‌దా? అంటే.. గ‌తంలో అయితే, ఇలాంటి ప్రశ్నలు వ‌చ్చిన‌ప్పుడు చంద్రబాబు ఠ‌క్కున త‌మ‌కు తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అని చెప్పేవారు. అదే స‌మయంలో ఒడిశాలోను, త‌మిళ‌నాడులో నూ పార్టీకి కార్యక‌ర్తలు, నాయ‌కులు ఉన్నార‌ని చెప్పేవారు. అండ‌మాన్‌లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఒక‌టి రెండు సీట్లలో విజ‌యం సాధించ‌డంతో టీడీపీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు నానా గొప్పలు పోయారు.

తెలంగాణను వదిలేసి….

కానీ, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. ఒడిశా, త‌మిళ‌నాడుల‌ను ప‌క్కన పెడితే.. తెలంగాణ‌లోనూ టీడీపీ గానం వినిపించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు., ఉన్న నలుగురు ఎవ‌రిదారి వారు చూసుకున్నారు. ఇక‌, ఏపీలోనూ గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గెలిచారు. స‌రే… ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. తాజాగా చంద్రబాబు క‌రోనా విష‌యంపై ఏపీ ప్రభుత్వానికి లేఖ‌లు సంధిస్తున్నారు. అనేక సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు. అదే స‌మ‌యంలో గంపెడు విమ‌ర్శలు చేస్తున్నారు. పేద‌లకు రూ. 5 వేలు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కేసులు దాస్తున్నార‌ని అంటున్నారు. వైద్యుల‌కు మాస్కులు కూడా ఇవ్వడం లేద‌ని యాగీ చేస్తున్నారు. వీటిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టరు. ప్రతిప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న‌కు ఉన్న హ‌క్కు ఇది. మ‌రి త‌న పార్టీ తెలంగాణ‌లోనూ ఉంద‌ని అంటున్నప్పుడు ఇవే విష‌యాలు అక్కడ ఎందుకు ప్రశ్నించ‌డం లేదు?

ఏపీ కంటే ఎక్కువగా…..

తెలంగాణ ప్రభుత్వం పేద‌ల‌కు క‌రోనాసాయం కింద రూ.1500 ఇస్తాన‌ని చెప్పింది. ఈ సాయం ఇప్పటికీ స‌గం మంది పేద‌ల‌కు అంద‌డం లేద‌ని జాతీయ మీడియాలోనే వార్తలు వ‌చ్చాయి. ఇక‌, గాంధీ వంటి కీల‌క ఆసుప‌త్రుల్లోనే వైద్యుల‌కు మాస్కులు ల‌భించ‌డం లేదు. స‌రైన జాగ్రత్తలు కూడా తీసుకోవ‌డం లేదు. అదేవిధంగా ప‌లు జిల్లాల్లో వైర‌స్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం వాటిని వెల్లడించ‌డం లేద‌ని తాజాగా వ‌స్తున్న విమ‌ర్శలు. మ‌రి వీటిని అక్కడే హైద‌రాబాద్‌లోని త‌న సొంతిట్లో ఉన్న చంద్రబాబు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు? అక్కడ కూడా త‌న పార్టీ ఉంద‌ని చెప్పిన ఆయ‌న గ‌తంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో కూడా పోటీ పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మౌనం వ‌హిస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ఎందుకు లెట‌ర్లు రాయ‌డం లేదు? అంటే.. ఇక‌, త‌న పార్టీని ఏపీకి మాత్రమే ప‌రిమితం చేయాల‌ని అనుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. వీటిని ఆలోచించే కొంద‌రు ఇప్పుడు టీడీపీ ఏపీకి మాత్రమే ప‌రిమిత‌మైంద‌ని లెక్కలు చెబుతున్నారు. మ‌రి చంద్రబాబు ఏమంటారో ? చూడాలి.

Tags:    

Similar News