వైసీపీ నుంచి వ‌చ్చిన వారిని వ‌దిలేసుకున్నట్టే?

చంద్రబాబుపై న‌మ్మకంతో.. ఆయ‌న విజ‌న్‌పై విశ్వాసంతో.. ఆయ‌న చేస్తున్న అభివృద్ధిని చూసి ముగ్ధులై.. మేం పార్టీ మారాం- అని చెప్పిన వైసీపీ మాజీ నాయ‌కులు, ప్రస్తుతం టీడీపీలో [more]

Update: 2020-10-11 02:00 GMT

చంద్రబాబుపై న‌మ్మకంతో.. ఆయ‌న విజ‌న్‌పై విశ్వాసంతో.. ఆయ‌న చేస్తున్న అభివృద్ధిని చూసి ముగ్ధులై.. మేం పార్టీ మారాం- అని చెప్పిన వైసీపీ మాజీ నాయ‌కులు, ప్రస్తుతం టీడీపీలో సాంకేతికంగా ఉన్న నాయ‌కులు 23 మందిని పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిగా ప‌క్కన పెట్టారా ? వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదా ? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీపై న‌మ్మకంతోనో.. చంద్రబాబుపై విశ్వాసంతోనో.. ప‌ద‌వుల‌పై ఆశ‌తోనో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వ‌చ్చి సైకిల్ ఎక్కారు. అయితే, వీరిలో ఒక‌రిద్దరికి మిన‌హా గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబు త‌న వారిని సైతం ప‌క్కన పెట్టి టికెట్లు ఇచ్చారు. అయితే వీరిలో అద్దంకిలో ఒక్క గొట్టిపాటి ర‌వికుమార్ మిన‌హా ఏ ఒక్కరు కూడా విజ‌యం సాదించ‌లేదు. పైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ యాక్టివ్‌గా లేని మాట వాస్తవం. కానీ, పార్టీలోనే ఉన్నారు.

ప్రయారిటీ లేదు……

వీళ్లలో కొంద‌రు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న జ‌గ‌న్ వీరిని ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు కాక‌పోతే.. కొన్నాళ్లకైనా చంద్రబాబు ద‌గ్గర‌ త‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంద‌న్న ఆశ‌ల‌తో చాలా మంది నేత‌లు ఉన్నారు. ఇప్పట్లో ఎమ్మెల్సీయో, లేదా మ‌రో ప‌ద‌వో వ‌చ్చే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వీళ్లకు పార్టీ ప‌ద‌వులే దిక్కు. చంద్రబాబు తాజాగా ప్రక‌టించిన పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీల్లో ఈ జంపింగ్ జపాంగ్‌లు ఎవ్వరికి అవ‌కాశం ఇవ్వలేదు. పోనీ.. రెండేసి పార్లమెంట‌రీ జిల్లాల‌కు ఒక ఇంచార్జ్‌ను నియ‌మించినా ఆ ప‌ద‌వుల్లోనూ ప్రయార్టీ లేదు.

మహిళా నేతలకు కూడా….

పోనీ.. పార్లమెంట‌రీ జిల్లా ప‌ద‌వులు ఇవ్వక‌పోయినా.. తెలుగు మ‌హిళా విభాగంలో పార్లమెంటు వారీగా మ‌హిళ‌ల‌కు ప‌ద‌వులు చంద్రబాబు క‌ట్టబెట్టారు. వారిలోనూ వైసీపీ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు కూడా ప్రాధాన్యత లేదు. రంప‌చోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వరికి అర‌కు పార్ల‌మెంట‌రీ జిల్లా మ‌హిళా అధ్యక్షురాలు ప‌ద‌వి ఇచ్చినా అక్కడ ఆమె ఎంత డ‌మ్మీ నేతో అంద‌రికి తెలిసిందే. మ‌హిళా నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వాలంటే చాలా మంది ఫైర్‌బ్రాండ్లే ఉన్నారు.

పూర్తిగా పక్కన పెట్టేసి….

వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన మ‌హిళా నేత‌ల్లో గిడ్డి ఈశ్వరి, వంత‌ల రాజేశ్వరి, పామ‌ర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన, అనంత‌పురం జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే చ‌రితారెడ్డి వంటివారు ఉన్నారు. వీరికి కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. అదే స‌మయంలో వైసీపీ నుంచి వ‌చ్చిన వారిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వీరిలో అమ‌ర్‌నాథ్‌రెడ్డి, సుజ‌య్‌కృష్ణరంగారావు వంటి వారు కూడా ఉన్నారు. వీరికి కూడా చంద్రబాబు రిక్త హ‌స్తమే ఇచ్చారు. దీంతో వైసీపీ నుంచి వ‌చ్చి సైకిల్ ఎక్కిన వారిని పూర్తిగా ప‌క్కన పెట్టేశారా ? అనే కోణంలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి వీరి ప‌రిస్థితి ఏంటో భ‌విష్యత్తే తేల్చాల్సి ఉంటుంది.

Tags:    

Similar News