సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ ముఖ్యం కదా

ఒక‌ప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చకు వ‌చ్చేది. అదేంటంటే.. ఆయ‌న‌కు తెలిసినంత‌గా రాజనీత‌జ్ఞత మ‌రెవ‌రికీ తెలియ‌దు.. ఎక్కడ త‌గ్గాలో.. ఎక్కడ పైచేయి [more]

Update: 2020-06-27 11:00 GMT

ఒక‌ప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చకు వ‌చ్చేది. అదేంటంటే.. ఆయ‌న‌కు తెలిసినంత‌గా రాజనీత‌జ్ఞత మ‌రెవ‌రికీ తెలియ‌దు.. ఎక్కడ త‌గ్గాలో.. ఎక్కడ పైచేయి సాధించాలో ఆయ‌న‌కు మాత్రమే తెలుసు!- అని! దీనికి కార‌ణం.. కేంద్రంలోని అప్పటి న‌రేంద్రమోడీ (ఎన్డీయే-1) ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కాద‌ని స్పెష‌ల్ ప్యాకేజీ ప్రక‌టించిన‌ప్పుడు.. ఆద‌రాబాద‌రాగా..చంద్రబాబు అర్ధరాత్రి మీడియా స‌మావేశం పెట్టి కేంద్రంపై ప్రశంస‌లు కురిపించ‌డ‌మే. దీనిని రాజ‌నీతిజ్ఞత‌గా కొనియాడిన వారు ఇప్పుడు లేరు. అంతేకాదు, ఇది ఎలా రాజ‌నీతిజ్ఞత అవుతుందో అప్పట్లో చెప్పిన వారు ఇప్పుడు క‌నిపించడ‌మూ లేదు.

తొందరపాటు నిర్ణయమే…..

ఇలాంటి దుందుడుకు వ్యవ‌హారాల మూలంగానే చంద్రబాబు త‌న ఇమేజ్‌ను కోల్పోయారు. హోదా వ‌ద్దన‌డం ఎంత త‌ప్పో.. ప్యాకేజీకి చంక‌లు గుద్దుకుని తాను ఎంత త‌ప్పు చేశారో.. త‌ర్వాత కాలంలో ఆయ‌న బాగా గ్రహించారు. ప్రజ‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత‌ను ఎదుర్కొన్నారు. ఈ విష‌యంలో చేసిన తొంద‌ర‌పాటు కార‌ణంగా.. ఇంటా బ‌య‌టా కూడా చంద్రబాబు విమ‌ర్శల పాల‌య్యార‌న‌డంలో సందేహంలేదు. మావాళ్లు.. హోదానే కోరుతున్నార‌ని మ‌ళ్లీ అరిచి గీపెట్టిన‌ప్పుడు ఢిల్లీ పెద్దలు గేలి చేశారు. ఇదేంటి బాబుకు మ‌తికానీ చెడిందా ? అని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శలు సంధించారు.

మోడీని ఆకాశానికి ఎత్తి…..

ఇక‌, కేంద్రం ప్యాకేజీనే ఇస్తానంటోంద‌న్నప్పుడు.. మీరెందుకు తొంద‌ర‌ప‌డి త‌లాడించారు..? మా భ‌విష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును ఎందుకు ఫ‌ణంగా పెట్టార‌ని ప్రజ‌లుప్రశ్నించారు. ఈ ఒక్క విష‌యంలోనే కాదు.. అప్పటి మోడీ ప్రభుత్వం తీసుకున్న అనే విష‌యాల్లో తొంద‌ర‌ప‌డి మ‌ద్దతు ప‌లికిన కార‌ణంగా.. ఢిల్లీలోని చంద్రబాబు మిత్రులు కూడా ఆయ‌న‌పై విమ‌ర్శలు సంధించారు. అంత‌కు ముందు పెద్ద నోట్లను ర‌ద్దు చేసిన వెంట‌నే చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి మోడీని ఆకాశానికి ఎత్తేశారు. అదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మోడీ నిర్ణయాన్ని ఏకిప‌డేశారు.

కీలక సమయాల్లో జగన్…..

అయితే ఇలాంటి కీల‌క స‌మ‌యాల్లో జ‌గ‌న్ వ్యవ‌హ‌రించిన శైలి.. ఇప్పటికీ ప్రశంస‌నీయ‌మే! అప్పట్లో మోడీతో స‌ఖ్యత‌తోనే ఉంటూనే ప్యాకేజీని విమ‌ర్శించారు. హోదా కోసం.. రాష్ట్రం మొత్తం తిరిగి ఆందోళ‌న చేశారు. అదే స‌మ‌యంలో మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాల‌పై కూడా మౌనం వ‌హించారు. అదే జ‌గ‌న్ ఇప్పుడు.. వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి.. దేశ ర‌క్షణ విష‌యంలో మోడీకి మ‌ద్దతు ప‌లికారు. అంతేకాదు.. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. మేం అంతా మీకు అండ‌గా ఉంటాం.. అని చెప్పారు. ఇది ఒక్క ఏపీలోనే కాదు.. పార్టీల‌కు అతీతంగా అన్నిపార్టీల‌లోనూ చ‌ర్చకు వ‌చ్చింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ముందు చూపు చూసి ఇత‌ర రాష్ట్రాల నేత‌లు సైతం ఔరా అంటున్నారు.

కొన్ని విషయాల్లో మాత్రం….

నాడు చంద్రబాబు, నేడు జ‌గ‌న్ పాల‌న‌ను ఇలాంటి కీల‌క విష‌యాల‌తో పాటు కేంద్ర ప్రభుత్వంలో వ్యవ‌హ‌రించే తీరులో పోల్చి చూసిన‌ప్పుడు చంద్రబాబు ఆలోచ‌న లేకుండా ఎన్డీయేతో క‌లిసున్నప్పుడు భ‌జ‌న చేయ‌డం… బ‌య‌ట‌కు వ‌చ్చాక విమ‌ర్శలు చేయ‌డంతోనే స‌రిపెట్టారు. జ‌గ‌న్ మాత్రం ప్రతి విష‌యంలో ఆచితూచి మ‌రీ అడుగులు వేస్తూ క‌ర్రా విర‌గ‌కుండా, పాము చావ‌కుండా అన్న చందంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఏదేమైనా సీనియార్టీ కాదు.. సిన్సియారిటీ ముఖ్యమన్న విష‌యాన్ని జ‌గ‌న్ ఫ్రూవ్ చేసుకున్నార‌న్న ప్రశంస‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి.

Tags:    

Similar News