Karthika Masam : కార్తీక మాసం ఆకాశ దీపాలు నేటితో సమాప్తం... దీప సమర్పణ
కార్తీకమాసం ముగియడంతో నేడు పోలి పాడ్యమిని రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు
కార్తీకమాసం ముగియడంతో నేడు పోలి పాడ్యమిని రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. కార్తీక మాసం ముగియడంతో నేడు దీపం వెలిగించి నదుల్లో వదులుతారు. దీనిని పోలి స్వర్గంగా కూడా అంటారు. పవిత్రంగా ఉండి శివ కేశవులను కార్తీక మాసంలో ధ్యానిస్తే నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన శుభ ఫలితాలను ఎవరూ ఆపలేరన్నదే పోలి స్వర్గం ఆంతర్యం. వేదవ్యాసుల మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు. సూర్యోదయంతో పాటు తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమిని చేస్తారు.
ప్రచారంలో ఉన్న కథ ఇది...
ఇందుకు ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో అత్తగారు ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్నకోడలి పేరు 'పోలి" . ఆమెకు దైవ భక్తి ఎక్కువ. ఆ దైవభక్తే అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్న కోడల్ని వేరుగా చూసేది. పూజలకు దూరంగా ఉంచేది. చిన్నకోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త.. తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది. అందుకే 'పోలి' ని ఏ పూజలు, నోములు, వ్రతాలు చేయనిచ్చేది కాదు.. తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది. కార్తీకమాసం రాగానే నెల రోజులూ ఇంటి పనులన్నీ చిన్నకోడలికి అప్పగించి కార్తీక మాస పూజలకు దూరంగా ఉంచి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీతీరానికి వెళ్లి స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేవారు అత్తగారు మిగిలిన కోడళ్లు.
నిత్యం దీపారాధన చేసి...
అత్త గారిని తోటి కోడల్ని అసలు నిందించకుండా, నిరాశ చెందని పోలి... ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని మజ్జిగ కవ్వానికి అంటుకున్న వెన్నను రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది. ఇలా కార్తీకమాసం మొత్తం నెల రోజులూ దీపం వెలిగించింది. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తిచేసుకుని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు. ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్లి వచ్చిన అత్తగారు, తోడికోడళ్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు.. కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ముప్ఫయి వత్తులు వెలిగించి...
తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడారు.. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేక పోయింది . స్వర్గ ప్రవేశానికి వచ్చేంత అర్హత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు. ఆ విధంగా పోలి బొందితో స్వర్గానికి చేరుకున్నారు. కార్తీకమాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథచె ప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులూ ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 వత్తులు వెలిగిస్తారు.. ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఈరోజు మహిళలంతా దీపాలు వెలిగించి కార్తీక మాసాన్ని ముగిస్తూ పోలి పాడ్యమిని జరుపుకుంటారు.