కోడలికి మత్తుమందిచ్చిన అత్త.. కళ్లు తెరిచిచూస్తే నరకంలో.!

కోడలు వద్దంటున్నా అత్త దారుణానికి పాల్పడింది. మత్తులో నుంచి తేరుకునేలోపే నరకంలో పడింది.

Update: 2022-05-09 13:41 GMT

others

కోడలికి ఏదో అయిందంటూ భూత వైద్యుడిని సంప్రదించారు భర్త అత్తమామలు. కొద్దిరోజులు ఇక్కడే ఉంటే బాగు చేస్తానని చెప్పడంతో నమ్మేశారు. తాను ఉండనని బతిమిలాడుకున్నా పట్టించుకోని మెట్టినింటి వారు నిర్దయగా అతని వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వైద్యం పేరుతో కీచకుడు ఆమెకు సుమారు 3 నెలల పాటు నిత్యం నరకం చూపించాడు. కన్నకొడుకు ముందే ఆమెపై రోజూ అత్యాచారం చేసేవాడు. తీరా ఓ రోజు అతను గదిలో ఫోన్ మర్చిపోవడంతో ఆమె బతికి బయటపడింది. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

బాలాసోర్ జిల్లాకు చెందిన ఓ మహిళకు 2017లో వివాహమైంది. ఆమెకు రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల కొద్దికాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. రోజూ గొడవలు జరుగుతుండడంతో కోడలికి ఏదో పట్టిందంటూ భూతవైద్యుడు ఎస్‌కే తరఫ్‌ని ఆశ్రయించారు. ఆమెను తన ఆశ్రమంలో కొద్దిరోజులు ఉంచితే బాగు చేస్తానంటూ నమ్మ బలికాడు. అయినా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో అత్త అత్యంత నీచానికి ఒడిగట్టింది.

కోడలికి మత్తుమందు ఇచ్చి భూతవైద్యుడి దగ్గర వదిలేసింది. కళ్లు తెరిచి చూసిన కోడలు భూతవైద్యుడి గదిలో ఉండడం చూసి హతాశురాలైంది. రెండేన్నరేళ్ల కొడుకును కూడా ఆమె వద్దే వదిలేశారు. కామంతో కళ్లు మూసుకుపోయిన భూతవైద్యుడు వైద్యం పేరుతో ఆమెకు నరకం చూపించాడు. 79 రోజులుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఓ రోజు అతను గదిలో ఫోన్ మర్చిపోవడంతో ఆమె ఆ నరక కూపం నుంచి బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త, అతని సోదరుడు, అత్తమామలపై కూడా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags:    

Similar News