కామారెడ్డి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది

Update: 2022-07-07 10:43 GMT

కామారెడ్డి జిల్లాలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసిందో భార్య. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన రమేష్ (26) అనే యువకుడు తన భార్యతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనములో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఈ జంట వికారాబాద్ పట్టణంలో ఉండేవారు. ఆ సమయంలో వికారాబాద్ పట్టణానికి చెందిన దస్తప్పాతో రమేష్ భార్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా రమేష్ తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు. రమేష్ భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు.. ప్రియుడు దస్తప్పాను పిలిపించుకుంటూ ఉండడంతో.. ఈ విషయం తెలిసిన రమేష్ భార్యను హెచ్చరించాడు.

ఇలాంటి పరిస్థితుల్లో.. భర్త రమేష్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడు దస్తప్పతో కలిసి ఇద్దరు ఎనిమిది రోజుల క్రితం రమేష్‌ను గొంతు నులిమి హత్య చేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టారు. తనపై అనుమానం రాకుండా ఆమె ఒక్కతే కర్ణాటకకు వెళ్ళింది. అక్కడ బంధువులు రమేష్ గురించి అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారు ఆమెను పోలీసులకు అప్పగించారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించడంతో ప్రియుడు దస్తప్పతో పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమె తన ప్రియుడుతో కలిసి రమేష్‌ను హత్య చేసినట్లు తెలిపింది. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News