నాటు తుపాకీతో స్పాట్ పెట్టాడు.. పేలకపోవడంతో..!

నిందితుడు పాల మల్లేశంను గతంలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయితేజపై

Update: 2023-08-03 13:50 GMT

మానకొండూర్ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన వీణవంక సాయితేజ (27) చెల్లెలు ఆత్మహత్య చేసుకుని మరణించడానికి మానకొండూర్‌కు చెందిన భాషబోయిన అరుణ్ (35) ప్రధాన కారణమని మనసులో కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులైన మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కందుల ప్రదీప్ (25) అలియాస్ చంది అలియాస్ ఆర్య, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన పాల మల్లేశంలతో కలిసి గత ఏప్రిల్ 19న హైదరాబాద్ నుండి ద్విచక్ర వాహనంపై మానకొండూర్‌కు వచ్చాడు. అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో అరుణ్ పై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఢిల్లీలో అక్రమంగా కొనుగోలు చేసిన నాటు తుపాకీని అందుకు వాడాడు. ఈ దాడిలో నాటు తుపాకీ పేలక పోవడంతో అరుణ్ ప్రాణాలతో బయటపడ్డాడు.

నిందితుడు పాల మల్లేశంను గతంలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయితేజపై హైదరాబాద్ నగరంలోని అల్వాల్, నల్లకుంట, మంచిర్యాల జిల్లా జైపూర్ ,పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లలో మత్తు, మాదక పదార్దాల వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రధాన నింధితుడైన సాయితేజ కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో గురువారం మానకొండూర్ ఇన్స్‌పెక్టర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఒక నాటు తుపాకీ రెండు తుటాలను స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News