చెప్పు దెబ్బ.. పగ పెంచుకుని

అవమానం.. పగ.. ఈ విషయాలు ఓ మనిషిని ఎంతటికైనా తెగించేలా ప్రేరేపిస్తాయి. వీటి కారణంగా ఎన్నో దారుణాలు జరగడం కూడా మనం చూసే

Update: 2023-07-04 03:33 GMT

అవమానం.. పగ.. ఈ విషయాలు ఓ మనిషిని ఎంతటికైనా తెగించేలా ప్రేరేపిస్తాయి. వీటి కారణంగా ఎన్నో దారుణాలు జరగడం కూడా మనం చూసే ఉంటాం. తాజాగా ఓ వ్యక్తిపై పగ పెంచుకుని.. అతడిని ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి తీసుకుని వచ్చి హత్య చేశారు. దీనికంతటికీ కారణం చెప్పు దెబ్బ.

తెలంగాణలో కనిపించకుండా పోయిన వ్యక్తి హత్య కేసు కర్నూలులో వీడింది. తెలంగాణలోని, వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, రామకృష్ణపురానికి చెందిన కావాలి భారతయ్య (55) కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఆయన కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో భారతయ్య కర్నూలు జిల్లాలో చనిపోయాడని గుర్తించారు. ఆయనను కిడ్నాప్ చేసిన హంతకులు, ఆ తర్వాత చంపేసి కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దహనం చేశారు.
ఉలిందకొండ పోలీసులు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా రామకృష్ణ పురానికి చెందిన రవీంద్ర గౌడ్, కల్లు దుకాణ నిర్వహించేవాడు. అప్పట్లో అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త రవీంద్ర గౌడ్ వేధింపులే కారణం అంటూ గ్రామస్తులు అతడిని విపరీతంగా కొట్టారు. అదే గ్రామానికి చెందిన భారతయ్య రవీంద్ర గౌడ్ ను చెప్పుతో కొట్టాడు. తనకు అవమానం చేసిన భారతయ్య పై రవీంద్ర గౌడ్ కక్ష పెంచుకున్నాడు. భార్య హత్య కేసులో జైలుకు వెళ్లిన రవీంద్ర గౌడ్ పగతో రగిలిపోయేవాడు. ఎలాగైనా భారతయ్యను చంపేయాలని అనుకున్నాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత భారతయ్యను చంపడానికి తనకు జైల్లో పరిచయమైన షఫీ అనే వ్యక్తిని సంప్రదించాడు. జూన్ నెల 26వ తేదీన అప్పరాల గ్రామం దగ్గర భారతయ్య ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. కారులో అక్కడికి వచ్చిన రవీంద్ర గౌడ్ ఊరి దగ్గర దింపుతానంటూ కారులో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత పథకం ప్రకారం తన దగ్గర ఉన్న రుమాలతో గొంతు బిగించాడు. రాడుతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి కల్లూరు మండలం, ఉల్లిందకొండ సమీపంలోని కొల్లంపల్లి తండా సమీపంలో పడేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసం.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భారతయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భార్య శివమ్మ తన భర్త మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో కుటుంబ సభ్యులు రవీంద్ర గౌడ్ మీద అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు రవీంద్ర గౌడ్ ను విచారించారు. దీంతో హత్య విషయం వెలుగు చూసింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Tags:    

Similar News