సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Update: 2022-11-13 01:47 GMT

సూర్యాపేట జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునగాల శివారులోని పెట్రోలు పంపు వద్ద గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాగర్ ఎడమ కాల్వ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో గత రాత్రి మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మునగాల వాసులు కొందరు వెళ్లారు. పూజ అనంతరం ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాల బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా, మునగాల శివారులోని పెట్రోలు బంకు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News