మందలించిందని.. కన్నతల్లినే కడతేర్చిన కొడుకు

ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సుధీర్ ఉన్నట్లుండి లేచి ఎక్సైజ్ చేయడం మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి పాపమ్మ..

Update: 2022-01-24 10:04 GMT

నవమాసాలు మోసి.. కని పెంచిన పిల్లలే తల్లికి ప్రపంచం. వాళ్లు ఏం చేసినా చూసి మురిసిపోతుంటుంది. తప్పు చేస్తే మందలిస్తుంది. నొప్పి వస్తే తట్టుకోలేదు. అలాంటి తల్లిని కడతేర్చాడు కన్నకొడుకు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపమ్మ అనే మహిళ.. కొడుకు, కూతురితో కలిసి సుల్తాన్ బజార్లో నివాసం ఉంటోంది. పాపమ్మ కొడుకు సుధీర్ మతిస్థిమితం కోల్పోవడంతో.. తల్లే అన్నీ తానై కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సుధీర్ ఉన్నట్లుండి లేచి ఎక్సైజ్ చేయడం మొదలు పెట్టాడు. అది గమనించిన తల్లి పాపమ్మ.. సుధీర్ ను మందలించింది. అంతే.. కోపంతో ఊగిపోయిన సుధీర్ పక్కనే ఉన్న రాడ్ తో తల్లిపై విరుచుకుపడ్డాడు. రాడ్ తో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో.. స్పృహ కోల్పోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తల్లిపై దాడి చేస్తున్న సమయంలో అడ్డొచ్చిన చెల్లిపై కూడా రాడ్ తో దాడి చేయడంతో ఆమె కూడా స్పృహ కోల్పోయింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకోగా.. అప్పటికే పాపమ్మ మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన సుధీర్ చెల్లెలిని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించి, పాపమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. సుధీర్ కు మతిస్థిమితం లేనికారణంగా అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News