బాలికపై అత్యాచారం.. ఆపై విదేశాలకు పారిపోయేందుకు యత్నం

దళిత బాలికపై అత్యాచారం చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2021-12-15 08:30 GMT

దళిత బాలికపై అత్యాచారం చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బీహార్ లోని అరారియాలో వెలుగుచూసింది. అరారియా ఎస్పీ హృదయకాంత్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహ్మద్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ఘటనానంతరం బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లడంతో.. ఆమె కుటుంబ సభ్యులు విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తనకోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితుడు వారికంట పడకుండా ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకుంటూ వచ్చాడు.

నేపాల్ పారిపోయేందుకు....
ఆ తర్వాత నిందితుడు ఢిల్లీ వైపు ఉన్నాడని పక్కా సమాచారం రావడంతో.. అరారియా పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. అత్యాచారం అనంతరం నిందితుడు నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్, మీరట్ ఇలా తనకు తెలిసిన వారు ఉన్న పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించాడు. ఎక్కడా ఆశ్రయం దొరక్కపోవడంతో నేపాల్ పారిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే నిందితుడిని చాందినీ చౌక్ లో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హృదయకాంత్ తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిన 12 రోజులకు నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మహ్మద్ ను పట్టుకునేందుకు సహకరించిన ఆయా రాష్ట్రాల పోలీసులకు ఆయన మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News