ఆస్పత్రిలో ఆ పని చేయొద్దన్నారని.. ఉస్మానియా భవనం పై నుంచి దూకి..

ఆస్పత్రిలోని కులీ కుతుబ్ షా భవనం నాల్గవ అంతస్తులోని ఎంఎం 2 వార్డులో నాగరాజు చికిత్స పొందుతున్నాడు. కాగా.. నాగరాజుకు రోజూ..

Update: 2022-04-07 10:24 GMT

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో మద్యం తాగవద్దని భార్య హెచ్చరించడంతో రోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అఫ్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన నాగరాజు (22) ఏప్రిల్ 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని భార్య సంతోష వెంటనే ఉస్మానియాకు తీసుకొచ్చి, అక్కడే చికిత్స చేయిస్తోంది.

ఆస్పత్రిలోని కులీ కుతుబ్ షా భవనం నాల్గవ అంతస్తులోని ఎంఎం 2 వార్డులో నాగరాజు చికిత్స పొందుతున్నాడు. కాగా.. నాగరాజుకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఆస్పత్రికి మద్యం తీసుకు రావాలని భార్యను కోరాడు. ఆస్పత్రిలో మద్యం తాగకూడదని ఆమె వారించింది. కోపంతో సంతోష ను పక్కకు తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి నాల్గవ అంతస్తులోని కిటికీ అద్దాలను పగలగొట్టి అందులోనుంచి కిందికి దూకాడు.
తలకు బలమైన గాయమవ్వడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యానికి బానిసైన నాగరాజు.. నాలుగు రోజులుగా మద్యం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య తెలిపింది. సంతోష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News