స్లో పాయిజన్ తో భర్తను హతమార్చిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..

ఒక రోజున కమల్ తల్లి ఉన్నట్టుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. కొద్దిరోజులకు కమల్ కు కూడా..

Update: 2022-12-04 11:39 GMT

mumbai slow poison murder

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తకు రోజూ తినే భోజనంలో కొద్ది కొద్దిగా విషం పెడుతూ.. భర్తను హతమార్చిందో భార్య. ట్విస్ట్ ఏంటంటే.. దానిని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని శాంతాక్రజ్ కు చెందిన కవిత-కమల్ కాంత్ భార్యభర్తలు. కొన్నాళ్ల క్రితం భర్తతో విభేదాల కారణంగా దూరంగా వెళ్లిన కవిత.. మళ్లీ పిల్లల భవిష్యత్ కోసం తిరిగి వచ్చింది. కమల్‌కాంత్, హితేశ్ జైన్ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరూ వ్యాపారులే.

ఒక రోజున కమల్ తల్లి ఉన్నట్టుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. కొద్దిరోజులకు కమల్ కు కూడా తట్టుకోలేనంతగా కడుపునొప్పిరావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వైద్యులు అతడిని పరీక్షించగా.. బ్లడ్ టెస్ట్ లో అతడి రక్తంలో ఆర్సెనిక్, థాలియం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఇది సాధ్యంకాని పని. మానవ శరీరంలో ఈ లోహాలు చేరడం అసాధారణమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
నవంబర్ 19న కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబీకులు కమల్ మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. ఇందులో ఏదో కుట్ర ఉన్నట్లుగా అనుమానం రావడంతో.. కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కవిత, కమల్‌కాంత్ బాల్య స్నేహితుడు హితేశ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..వాళ్లు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు.
బాధితుడి మెడికల్ రిపోర్టు, బాధితుడి భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంతోపాటు కమల్‌కాంత్ తీసుకునే ఆహారం గురించి సేకరించిన విషయాలతో కుట్రను బయటపెట్టినట్టు పోలీసులు తెలిపారు. భర్తతో వివాదం తర్వాత.. తిరిగి కాపురానికి వచ్చిన కవిత హితేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి కమల్ అడ్డుగా ఉన్నాడని భావించింది. ఒక్కసారిగా అతను చనిపోతే అందరికీ అనుమానం వస్తుందని.. ప్రియుడితో కలిసి భర్త తినే ఆహారంలో కొద్దికొద్దిగా విషం కలిపి ఇచ్చేది.
కాగా.. కమల్ కాంత్ తల్లి కూడా కడుపు నొప్పితో బాధపడి మృతి చెందడంతో ఆమెకు కూడా స్లో పాయిజన్ ఇచ్చి చంపేసి ఉంటారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కవిత, హితేశ్‌లను కోర్టు ఈ నెల 8 వరకు పోలీస్ కస్టడీకి అప్పజెప్పింది.


Tags:    

Similar News