భార్యను పాతిపెట్టి అమాయకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన భర్త.. చివరికి..

Update: 2022-09-02 09:36 GMT

కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడో కసాయి భర్త. ఆమె శవాన్ని పొలంలో పాతిపెట్టి ఏమీ తెలియనట్టు అమాయకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఆమె బంధువులను పోలీసులు విచారించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యను చంపేసి డ్రామాకు తెరతీసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగంపేట మండలం మర్రిపూడికి చెందిన పాపారావుకి పెద్దాపురం మండలం కాండ్రకోటకి చెందిన బున్ని(23)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లైన ఏడాదిపాటు కాపురం సాఫీగానే సాగింది. గత మూడేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో వేధింపులు భరించలేక బున్ని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే ఉంటూ పెద్దాపురం పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 30 వ తేదీ మంగళవారం రాత్రి బున్ని ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన సమయంలో భర్త పాపారావు ఆమె వద్దకు వచ్చాడు. ఇంటి వద్ద వదిలిపెడతానని బైక్ ఎక్కించుకుని వెళ్లాడు.

మార్గంమధ్యలో బైక్ ఆపి పథకం ప్రకారం కత్తితో ఆమె గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. ఆమె శవాన్ని అక్కడే పొలాల్లో పాతిపెట్టేసి ఆధారాలు దొరక్కుండా చేసి హైడ్రామాకు తెరతీశాడు. ఏమీ ఎరగనట్టు రంగంపేట పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె బంధువులకు సమాచారం ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన ఆమె బంధువులు పొలాల్లో పాతిపెట్టిన ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాపారావును పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే కనీస విచక్షణ కూడా లేకుండా తల్లిని మట్టుబెట్టి తండ్రి జైలుపాలయ్యాడు.

Tags:    

Similar News