Murder Case : వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు
వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సీబీఐ రంగంలోకి దిగింది
తెలంగాణలో జరిగిన వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సీబీఐ రంగంలోకి దిగింది. సంచలనం సృష్టించిన హత్య కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. 2021లో పెద్దపల్లి జిల్లాలో జరిగిన దారుణ ఘటన నేపథ్యంలో మృతుడి తండ్రి న్యాయపోరాటంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వామన రావు దంపతుల హత్య కేసు తెలంగాణలో సంచలనం కలిగించింది. రహదారిపైనే దుండగులు భార్యాభర్తలను నరికి చంపారు.
నాలుగేళ్ల క్రితం జరిగిన...
తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ ( అధికారికంగా స్వీకరించింది. ఈ మేరకు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
ఈ కేసులో నిందితులుగా...
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ సంచలన కేసు దర్యాప్తు అధికారిగా సీబీఐ ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును స్వీకరించిన సీబీఐ, ఇకపై అన్ని కోణాల్లో మరింత లోతుగా విచారణ జరపనుందని తెలిసింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హైకోర్టు న్యాయవాదులైన వామనరావు, ఆయన భార్య నాగమణి దంపతులను కొందరు దుండగులు నడిరోడ్డుపై దారుణంగా నరికి హత్య చేశారు. కేసును విచారించిన రాష్ట్ర పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై కొందరి రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.
రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై...
అయితే, రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వామనరావు తండ్రి గట్టు కిషన్రావు, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడు, కోడలు హత్యపై స్థానిక పోలీసులు విచారణ సరిగా చేయలేదని, నిందితులను అదుపులోకి తీసుకోలేదని, హత్యకు కారకులైన వారిని వదిలేసి నామ్ కే వాస్తేగా నిందితులను కొందరిని అదుపులోకి తీసుకుని కేసును పక్క దోవపట్టించే ప్రయత్నం చేశారని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, గత నెల ఆగస్టు 12న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ రంగప్రవేశం చేయడంతో ఈ కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.