ముళ్లపొదల్లో విద్యార్థిని మృతదేహం లభ్యం.. పరువుహత్యగా భావిస్తున్న పోలీసులు

హార్దిక మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. రెండునెలల క్రితం బడికాయలపల్లికి చెందిన శ్రీనివాసులు

Update: 2022-01-24 13:51 GMT

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కృష్ణాపురం సమీపంలో పోలీసులకు హార్థిక(19) అనే యువతి మృతదేహం లభ్యమైంది. ఆ యువతిది పరువు హత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హార్దిక మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. రెండునెలల క్రితం బడికాయలపల్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరి కులాలు వేరుకావడంతో.. పెద్దలు ఆ జంటను వేరు చేశారు.

10 రోజులుగా హార్దిక తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. హఠాత్తుగా సోమవారం ఉదయం కృష్ణాపురం గ్రామ శివారులోని ముళ్లపొదల్లో శవమై కనిపించింది. పోలీసులు మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ మధు రామచంద్రుడు మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం బైక్ నేర్చుకుంటానని ఇంటి నుంచి వెళ్లిన హార్దిక.. తెల్లారేసరికి ఇలా శవమై కనిపించిందని తెలిపారు. ఆమెకు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉండగా.. ఇటీవలే అది గ్రామపెద్దల సమక్షంలో సద్దుమణిగినట్లు తెలిసిందన్నారు. కోరుకున్న వ్యక్తికి దూరంగా ఉంచడంతో హార్దిక మనస్తాపం చెంది.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నా.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేసి నిజానిజాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.


Tags:    

Similar News