కేవలం కొట్టడం కోసమే తీసుకెళ్తారు.. నారాయణ అరెస్టుపై ఎంపీ RRR ఆందోళన

తన కేసులోనూ ఇలానే జరిగిందని.. విచారణలో అందరూ బయటికి వస్తారని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు.

Update: 2022-05-10 09:30 GMT

మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై వైసీపీ ధిక్కార ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. ఏపీ సీఐడీ అధికారులు కొట్టడం కోసమే తీసుకెళ్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ చేసే గదుల్లో సీసీ కెమెరాలు తీసేస్తారని.. వ్యక్తిగత సిబ్బంది ఉంటే పంపించేస్తారని ఆరోపించారు. కొట్టడం కోసమే తీసుకెళ్తారు.. ఆ తర్వాత పచ్చి అబద్ధాలు ఆడతారని ఆయన మండిపడ్డారు. తన కేసులోనూ జరిగాయని.. విచారణలో అందరూ బయటికి వస్తారని ఆయన హెచ్చరించారు.

మంత్రి నారాయణను అరెస్టు చేయడం తప్పు అని రఘురామ అన్నారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒకవేళ నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే.. సీఎం జగన్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కూడా అరెస్టు చేయాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. టెన్త్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై తిరుపతి సభలో సీఎం జగన్ ఒకలా.. మరుసటి రోజు విద్యా మంత్రి బొత్స మరోలా చెప్పారని.. వాటిలో ఏది నిజమని ఆయన ప్రశ్నించారు.

మంత్రి నారాయణ ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి తెలియదని.. దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కోర్టును ఆశ్రయించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామికవాదులు సైతం నారాయణ అరెస్టును ఖండించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్లు ఎంతకైనా తెగిస్తారు.. దొంగలు, క్రూరమృగాలంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News