YSRCP : జగన్ ఆలోచన అలా.. నేతలు మాత్రం డీలా
స్థానికసంస్థల ఎన్నికలపై జగన్ ఆశలు పెట్టుకున్నారు
స్థానికసంస్థల ఎన్నికలపై జగన్ ఆశలు పెట్టుకున్నారు. వైసీపీని మరింత బలోపేతం చేయనున్నాయా? మున్సిపల్ ఎన్నికలు నాలుగు నెలల్లో జరిపేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ఎన్నికలపై జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఓటు బ్యాంకు పటిష్టమవుతుందని నమ్ముతున్నారు. అందుకే స్థానిక సంస్థలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని జగన్ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే అక్కడ పార్టీ నేతలు, క్యాడర్ మరింతగా జెండా పట్టుకుని నిలుచుంటారని జగన్ భావిస్తున్నారు. అందుకే కూటమి పార్టీల కంటే వైసీపీ అధినేతకే స్థానికసంస్థల అవసరం ఉంది. కానీ నేతలు మాత్రం నియోజకర్గాల పునర్విభజన జరిగి తమ సీటు గల్లంతవుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు.
అంత సులువు కాకున్నా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అంత సులువు కాదు. అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజీ ఎక్కువగా ఉంటుంది. గతంలో జరిగిన అన్ని ఎన్నికలు ఇలాంటి ఫలితాలు వచ్చాయి. కానీ పోటీ చేయడంతో పాటు ఓటర్లు కూడా ఇక సాధారణ ఎన్నికల వరకూ పార్టీ వైపు ఉంటారు. ఇది జగన్ అంచనా మాత్రమే కాదు. స్థానిక నియోజకవర్గాల ఇన్ ఛార్జులు కూడా తమ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తారు. తమ అనుచరులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తారు. కసితో పనిచేస్తారు. అది చాలు వైసీపీ మరింత బలోపేతం కావడానికి అని జగన్ భావిస్తున్నారు.
పాదయాత్రకు ముందే...
తన పాదయాత్రకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయితే ఇక ఆ సమయంలో తనకు మరింత సహకారం అందుతుందని జగన్ నమ్ముతున్నారు. జగన్ అంచనాలు ఒకరకంగా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంపై నెగ్గడం ఎలా? చాలా మంది నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో కొందరు నేతలున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీని బలోపేతం చేస్తాయని జగన్ నమ్ముతుంటే.. నేతలు మాత్రం తమ జేబులకు చిల్లు పడాతాయేమోనన్న ఆందోళనలో ఉన్నారు.