Ys Jagan : మైనారిటీ రిజర్వేషన్లపై జగన్ కీలక వ్యాఖ్యలు.. వారితోనా పొత్తు అంటూ

మైనారిటీల రిజర్వేషన్ల రద్దుచేస్తామని చెబుతున్న బీజేపీతో ఎందుకు చంద్రబాబు చేతులు కలిపాడని వైఎస్ జగన్ అన్నారు

Update: 2024-05-09 06:53 GMT

మైనారిటీల రిజర్వేషన్ల రద్దుచేస్తామని చెబుతున్న బీజేపీతో ఎందుకు చంద్రబాబు చేతులు కలిపాడని వైఎస్ జగన్ అన్నారు. కర్నూలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లను ఇచ్చారన్నారు. మైనారిటీలను వేరుగా చూడటం, వారి జీవితాలతో ఆడుకోవడం కాదా? అని జగన్ ప్రశ్నించారు. నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, సీఏఏ విషయంలో కానివ్వండి.. తమ పార్టీ ధోరణి ఎప్పటికీ మారదని తెలిపారు. నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా, మైనారిటీ సోదరిని శాసనసభ మండలి వైెస్ ఛైర్మన్ చేశామని జగన్ తెలిపారు.

తాము ముస్లింలకు...
ముస్లింలకు ఏడు ఎమ్మెల్యేల సీట్లు మొదటిసారి ఇచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని గర్వంగా చెబుతున్నానని అన్నారు. మైనారిటీలకు ఎప్పుడైనా చంద్రబాబు ఇలా అన్ని రకాలుగా ఆదరించారా? అని ప్రశ్నించారు. మైనారిటీలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం వైసీపీది అని అన్నారు. మైనారిటీలో ఆత్మస్థయిర్యం పెరగడానికి, వారికి గౌరవం సమాజంలో పెంపొందించడానికి అన్ని రకాలుగా వారిని ఉన్నతస్థాయిలో ఉంచుతున్నామని తెలిపారు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమన్న జగన్ మైనారిటీలకు రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న పార్టీతో చేతులుకలిపిన చంద్రబాబుకు అండగా నిలుస్తారా? అని ప్రశ్నించారు.
ఆరునూరైనా...
ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జగన్ అన్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, నాలుగుశాతం రిజర్వేషన్ల విషయంలో మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ తెలిపారు. తాను అధికారంలోకి వస్తే సింగపూర్ నుమించి రాజధానిని నిర్మిస్తానన్న చంద్రబాబు కనీసం ఆ దిశగా ప్రయత్నం చేశారా? అని అడిగారు. మైనారిటీలను తన ప్రయోజనాలకు వాడుకునేందుకు చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారన్నారు. సూపర్ సిక్స్ తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. ప్రస్తుతం వస్తున్న పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీకే ఓటు వేయాలని కోరారు. మైనారిటీలపై మీ బిడ్డది నిజమైన ప్రేమ అని అన్నారు. చంద్రబాబును ఓడించండి.. వైసీపీని గెలిపించండి అని కర్నూలులో జగన్ అన్నారు


Tags:    

Similar News